YSRCP Prakasam: అధికార వైసీపీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది.. రాష్ట్రస్థాయిలో చాలా పోస్టులు ఖాళీ ఉండడంతో భర్తీ చేసేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ (ఆర్టీసీ, మైనింగ్, సివిల్, పోలీసు హోసింగ్, ఫుడ్) వంటి పదవులు.., అర్బన్ అథారిటీల పదవులు.., కార్పొరేషన్ చైర్మన్ పదవులు.., టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు.., ఎమ్మెల్సీల పదవులతో వైసిపిలో సందడి నెలకొంది. వీటి కోసం ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. సీఎం జగన్ మదిలో ఇప్పటికే కొన్ని పేర్లున్నాయి. పోటీ చేసి ఓడిపోయినా నేతలకు, నియోజకవర్గాల ఇంచార్జిలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే వీటిలో 50 శాతం మహిళలకే కేటాయించడానికి సీఎం జగన్ మొగ్గు చూపుతున్నారట. అందుకే కొందరు నేతలు ప్రోటోకాల్ తమకు ఉంటె బాగుంటుందని.., తమ పేరు చేర్చాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలో ఎవరెవరికి..? ఎటువంటి అవకాశాలున్నాయి చూద్దాం..!!
YSRCP Prakasam: బాచిన కృష్ణ చైతన్య..! చైర్మన్ గిరీ పక్కా…!?
అద్దంకి వైసీపీ ఇంఛార్జిగా బాధ్యతల్లో ఉన్న బాచిన కృష్ణ చైతన్యకు రాష్ట్రస్థాయిలో ఒక కార్పొరేషన్ కి చైర్మన్ గిరీ ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. కృష్ణ చైతన్య తండ్రి గరటయ్య పార్టీలో మొదటి నుండి కీలకంగా పని చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కి సహకరించారు. 2019 ఎన్నికల్లో అద్దంకి నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో కృష్ణ చైతన్య ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించి కీలకంగా పని చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు. గ్రామా పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులకు అండగా ఉంటూ గెలిపించారు. జిల్లాలో వైసీపీ కాస్త బలహీనం అనుకున్న నియోజకవర్గంలో కూడా ఊహించని కొన్ని స్థానాల్లో కూడా గెలుపొందడంతో కృష్ణ చైతన్యపై అధిష్టానం చూపు పడింది. అప్పుడప్పుడూ అవినీతి ఆరోపణలు.., అక్కడక్కడా అసమ్మతి వర్గాలు, అసంతృప్తులు ఉన్నప్పటికీ పార్టీ బలోపేతం విషయంలో, దిగువ స్థాయి క్యాడర్ కి అందుబాటులో ఉండడంలో సఫలీకృతులయ్యారు. దీంతో ఈయనకు రాష్ట్రస్థాయిలో మంచి ప్రోటోకాల్ ఉండే పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. కీలకమైన మూడు కార్పొరేషన్లలో ఒక చైర్మన్ సీటు ఈయనకు దక్కే అవకాశం ఉంది.
వరికూటి సోదరుల్లో ఒకరికి..!?
వైసీపీ ఆవిర్భావం నుండి వరికూటి సోదరులు పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో వరికూటి అశోక్ బాబు, చీరాల నియోజకవర్గంలో వరికూటి అమృతపాణిలు ఇద్దరూ పార్టీ ఆవిర్భావం నుండీ కీలకంగా పని చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో రెండు చోట్ల వారు అనుకున్న వారికి అభ్యర్థిత్వాలు ఇవ్వకపోవడంతో కినుక వహించారు. అశోక్ బాబు కొండపి టికెట్ ఆశించినప్పటికీ.. చివరి నిమిషంలో డాక్టర్ వెంకయ్యకి ఇచ్చారు. దీంతో స్వల్ప తేడాతో ఆ సీటుని వైసీపీ కోల్పోయింది. మరోవైపు చీరాలలో అమృతపాణి వర్గం వ్యక్తిగత వైరం నేపథ్యంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కి సహకరించలేదనే ఫిర్యాదులున్నాయి. ఇక్కడ కొండపి, అక్కడ చీరాల రెండు చోట్ల వరికూటి వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ పార్టీలో నిబద్ధతగల ఉండడం, స్థానికంగా వర్గాల డిమాండ్లు ఉండడంతో ఈ ఇద్దరిలో ఒకరికి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొండపి టికెట్ ఆశించి, భంగపడిన అశోక్ బాబుకే ఎక్కువ అవకాశాలున్నట్టు చెప్తున్నారు. ఈ సారి ఇవ్వకుంటే వచ్చే ఏడాదిలో మాత్రం పక్కాగా ఇవ్వనున్నారు. అయితే అశోక్ బాబు వర్గం మాత్రం కొండపి ఇంచార్జి పదవి ఆశిస్తున్నారు.
సింగరాజు వెంకట్రావుకి..!!
పార్టీ ఒంగోలు నగర శాఖ అధ్యక్షుడుగా సుదీర్ఘకాలంగా పని చేస్తున్న సింగరాజు వెంకట్రావుకి కీలక పదవి దక్కే అవకాశాలున్నాయి. వెంకట్రావు మొదటి నుండి పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ వాయిస్ ను నగరంలో బలంగా వినిపించారు. అప్పటి అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకుని నిలబడ్డారని పేరుంది. అందుకే ఆయనకు లేదా ఆయన భార్యకు ఒంగోలు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్ గిరీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే వీరి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయం, సీఎం ఆఫీస్ నుండి తెలుసుకున్నట్టు సమాచారం.
- నిజానికి నామినేటెడ్ పదవులు అనగానే జిల్లాలోని ఓ కీలక మాజీ ఎమ్మెల్యే పేరు కీలకంగా వినిపించింది. ఆయన అనుచరులు కూడా ఆశిస్తున్నారు. కానీ ఆయన పదవిని తిరస్కరించినట్టు సమాచారం. కొన్ని నెలల నుండి ఇంచార్జి మార్పు విషయంలో ఆయనకు, పార్టీ పెద్దలకు ఏకాభిప్రాయం కుదరడం లేదు. అందుకే ఇంచార్జి, నియోజకవర్గంలో పెత్తనం అంశం ముందుగా తేలకుండా నామినేటెడ్ పదవులు వద్దు అని సున్నితంగా తిరస్కరించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.