Mandali Budda Prasad: జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల తెలుగు అకాడమి పేరును తెలుగు – సంస్కృత అకాడమిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివిధ వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ద ప్రసాద్ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆయన లేఖ రాశారు. అకాడమి పేరు మార్చడంపై ప్రజాబిప్రాయం ఎలా ఉందో ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయనీ, సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వివరించారు.
సంస్కృత భాషాబివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదనీ, అందు కోసం ప్రత్యేకంగా అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. తమ మాటలను ఎదుటి వారు వినాలని కోరుకునే వారు ఇతరుల మాటలను గౌరవించాలనీ, ఇది ప్రజాస్వామ్య మూలసూత్రమని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందే తప్ప నష్టమేమీ ఉండదని మండలి బుద్దప్రసాద్ అన్నారు.
తెలుగు అకాడమి పేరు మార్పును తెలుగు – సంస్కృత అకాడమి అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మినహా ఎవరూ సమర్ధించడం లేదని అన్నారు.
తెలుగు అకాడమి పేరు మార్చడంపై అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి. మంత్రులు పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి తదితరులు ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ఈ అంశంపై చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలను విమర్శిస్తున్నారు.