Home వార్తలు Village Secretariat: గ్రామ సచివాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్..అధికారులకు షాక్

Village Secretariat: గ్రామ సచివాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్..అధికారులకు షాక్

Village Secretariat: ప్రకాశం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ గ్రామ సచివాలయ భవనానికి తాళం వేసి అధికారులకు షాక్ ఇచ్చారు. భవనం నిర్మించి రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వం నుండి బిల్లులు రాకపోవడంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ ఈ పని చేశారు. జిల్లాలోని ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామ సచివాలయ భవనాన్ని కాంట్రాక్టర్ అంజిరెడ్డి నిర్మించారు. ఈ భవనానికి 2020 ఫిబ్రవరి 10న భూమి పూజ నిర్వహించగా, అదే ఏడాది సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణం పూర్తి చేశారు.

2020 సెప్టెంబర్ 17న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి రూ.40లక్షలు ఖర్చు చేసినట్లు కాంట్రాక్టర్ అంజిరెడ్డి తెలిపారు. భవన నిర్మాణానికి తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నానని కాంట్రాక్టర్ అంజిరెడ్డి వాపోయారు. రెండేళ్లు అవుతున్నా బిల్లులు రాకపోవడం, అధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో విసుగు చెంది తాళం వేసినట్లు తెలిపారు కాంట్రాక్టర్ అంజిరెడ్డి. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.  

Exit mobile version