Home వార్తలు Vice MPP Elections: సైలెంట్ గా ..జాగ్రత్తగా.. కొన్ని మండలాల్లో పోటాపోటీ..!!

Vice MPP Elections: సైలెంట్ గా ..జాగ్రత్తగా.. కొన్ని మండలాల్లో పోటాపోటీ..!!


Vice MPP Elections: రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే గా ఎన్నికైన ప్రతి నాయకుడు మంత్రి పదవి వరించాలి ఆశపడుతుంటారు. అదే మండల స్థాయిలో అయితే ఎంపీటీసీ ఎన్నికైన నాయకుడు ఎంపీపీ గానో లేకపోతే వైస్ ఎంపీపీగానో కావాలని కోరుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ లలో రెండవ ఉపాధ్యక్ష పదవి (వైస్ ఎంపీపీ) ఎన్నికకు అవకాశం లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాల మేరకు నిన్న మండల పరిషత్ కార్యాలయాల్లో రెండవ ఉపాధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. జిల్లాలోని 53 మండలాల్లో మంగళవారం ఈ ప్రక్రియను అధికారులు నిర్వహించగా కొన్ని మండలాల్లో ఏకాభిప్రాయంతో వైస్ ఎంపిపి ఎన్నిక సైలెంట్ గా జరిగిపోగా కొన్ని మండలాల్లో పోటీ అధికారం ఉండటం, గ్రూపు విభేదాలు బహిర్గతం అయ్యాయి. పదవులు ఆశించి భంగపడిన ఎంపీటీసీలు రాజీనామా ఆస్త్రాలను సంధించారు. జిల్లాలోని నాగులుప్పలపాడు, కురిచేడు, పీసీ పల్లి, గిద్దలూరు, జరుగుమల్లి మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నికలు ఆసక్తికరంగా జరిగాయి.

నాగులుప్పలపాడు మండల వైస్ ఎంపీపీ పదవి విషయంలో జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వైస్ ఎంపీపీ పదవికి ఎంపీపీ అంజమ్మ భర్త కృష్ణారెడ్డి కొందరిని ప్రతిపాదించగా, సంతనూలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు మరో సభ్యుడి పేరు సూచించడం ఆసక్తికరంగా మారింది. ఇటు ఎంపీపీ మద్దతుదారుడు, అటు ఎమ్మెల్యే మద్దతుదారులు ఎవరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో చివరకు ఓటింగ్ జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితులు తెలుసుకున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మంత్రి సూచనలతో నిడమానూరు 2 ఎంపీటీసీ మల్లెం జాన్సన్ ను వైస్ ఎంపీపీగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఎన్నిక అనంతరం ఉప్పగంగూరు ఎంపీటీసీి ఎం వెంకట్రావు, రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ కే విజయ్ కుమార్ లు వాగ్వివాదానికి దిగడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

గిద్దలూరులో వైస్ ఎంపీపీ ఆశించి భంగపడిన కొమ్మునూరు ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్వరరావు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ కు అందజేశారు. జరుగుమల్లి మండలంలో అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపీపీ వర్గానికి చెందిన 8 మంది ఎంపీటీసీలు ఎన్నికకు గైర్హజరు కావడంతో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది. కురిచేడు మండలంలో తొలుత ప్రకటించిన ఆవుల లక్ష్మిదేవిని కాకుండా అన్నెం అరుణ పేరును ఎమ్మెల్యే సిఫార్సు చేయడంతో కొందరు ఎంపీటీసి సభ్యులు వాకౌట్ చేశారు. తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఎమ్మెల్యే సూచించిన అరుణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పీసీ పల్లి, అర్ధవీడు మండలంలోనూ రెండు వర్గాలు పోటీ పడ్డాయి. నాటకీయ పరిణామాల మధ్య వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు.

Exit mobile version