Home వార్తలు Tragedy: ముగ్గురు విద్యార్ధుల మృతితో నిడమానూరులో విషాదం..

Tragedy: ముగ్గురు విద్యార్ధుల మృతితో నిడమానూరులో విషాదం..

Tragedy: విద్యార్ధుల ఈత సరదా మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఉంగుటూరు మండలం ఎం నిడమానూరులో చోటుచేసుకుంది. ఆదివారం అదృశ్యమైన ముగ్గురు విద్యార్ధులు.. మూసి నదిలో విగతజీవులుగా కనిపించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లికి వెళితే.. ఎం నిడమానురు గ్రామానికి చెందిన విద్యార్ధులు  పిడుగురాళ్ల వాసు (15), చెంచు మహేష్ (13), లింగతోటి జగన్ (12) ఆదివారం స్కూల్ కు సెలవు కావడంతో పొందూరు సమీపంలోని మూసీ వాగు వద్దకు వెళ్లారు. సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఆ తరువాత ఈత సరదా తీర్చుకునేందుకు నీటిలోకి దిగారు. వారు నీటిలో దిగిన ప్రదేశంలో గుంటలు ఉండటంతో మునిగిపోయారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు నిన్న రాత్రంతా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో వెతకడం ప్రారంభించారు.

ఈ పిల్లలను మూసి వాగు వద్ద చూసినట్లు ఎవరో చెప్పగా అక్కడికి వెళ్లి చూశారు. అయినా పిల్లల ఆచూకి కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, గజ ఈతగాళ్లతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు లభ్యంకావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్ధుల మృతితో నిడమానూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version