ఏపి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రేపు రిటైర్ అవ్వనున్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్న 2024 జూన్ వరకూ అంటే సుమారు ఏడాదిన్నరకుపైగా ఈ పోస్టులో కొనసాగనున్నారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, టీటీడీ ఈఓగా, పలు కీలక శాఖల్లోనూ బాధ్యతలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేసింది. సీనియారిటీ జాబితాలో ఉన్న పూనం మాలకొండయ్య ను సీఎంఓలోకి తీసుకున్నారు. ఆమెను సీఎం జగన్ స్పెషల్ సీఎస్ గా నియమించారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా మదుసూధనరెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మహ్మద్ దివాన్ లను ప్రభుత్వం నియమించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న బుడితి రాజశేఖర్ ను జీఏడిలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.