Home వార్తలు ఓటుకు లక్ష పంచినా జనసేనదే గెలుపు : పవన్ కళ్యాణ్

ఓటుకు లక్ష పంచినా జనసేనదే గెలుపు : పవన్ కళ్యాణ్

రానున్న ఎన్నికల్లో పిఠాపురంలో గెలిచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 160 మంది పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …. పిఠాపురం ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.పొత్తులో బాగంగా పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి దేశం మొత్తం మనవైపు చూసేలా చేద్దామన్నారు.

కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. పిఠాపురం నాకు ప్రత్యేకమైన నియోజకవర్గం. గెలుపు కోసం ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోలేదు. రాష్ట్రం కోసం పని చేసే నన్ను.. గెలిపించే నియోజకవర్గం ఉండాలన్న సమయంలో పిఠాపురం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మా నియోజకవర్గంలో పోటీ చేయండి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పిన తీరు నా గుండెకు తాకింది. 2009, 2019లో పిఠాపురం నుంచి పోటీ చేయమని చాలా మంది అడిగారు. అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని అన్నారు.తాను అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తిని…సమస్యను తగ్గించే వ్యక్తిని… సమాజాన్ని కలిపే వ్యక్తిని… ఒక్కసారి నేను పని చేయడం చూస్తే నన్ను ఎప్పటికి వదులుకోరు. మీ అందరి, సహకారం, దీవెనలతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో బలమైన విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

సహజ వనరులను కాపాడతాం

పిఠాపురం నియోజకవర్గంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారికి చేయూతనిచ్చే పథకాలు లేవు. కడుపు కాలిన మత్స్యకారుల బాధను అర్ధం చేసుకోగలను. ఉప్పాడ గ్రామం నిత్యం కోతకు గురవుతోంది. ఇప్పటికే పాత ఉప్పాడ గ్రామం మూడొంతులు కోతకు గురైంది. గుడి.. బడి.. రోడ్డు.. ఇళ్లు అనే తేడాలేదు. సర్వం కడలి గర్భంలో కలిసిపోతోంది. దానికి శాశ్వత పరిష్కారం చూపించాలి. నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. దానిని నిలువరించలేకపోతున్నామని చాలా మంది పెద్దలు నిస్సహాయత వ్యక్తం చేశారు. మన ప్రభుత్వంలో సహజవనరులు దోపిడీకి గురికాకుండా చూసుకుంటాం. ప్రజలను భయపెట్టే శక్తులను సంపూర్ణంగా నిలువరించే బాధ్యత తీసుకుంటాను.

వైసిపి లో క్లాస్ వార్ అర్థం వేరు.

పిఠాపురంలో నన్ను నిలువరించే బాధ్యత పెద్దిరెడ్డి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నారు. ఢిల్లీలో ఆయన్ని ఒక సందర్భంలో కలసినప్పుడు… చిత్తూరు జిల్లాలోని తమ నియోజకవర్గంలో తమకి పోటీగా బయటవారిని రానియ్యం… అని చెప్పారు. వాళ్ళ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ వ్యక్తి బయటకు వెళ్లి పార్టీ పెడితే.. అతనిపై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి వాళ్లు బీసీలకు అండగా ఉన్నామని చెబుతారు. ఇలాంటి వాళ్ళా బీసీలకు అండగా ఉండేది? మళ్ళీ క్లాస్ వార్ అని మాట్లాడుతారు. వారి ఉద్దేశం లో క్లాస్ వార్ అంటే…. తాము తప్ప ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదు అని అర్థం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అధి సరికాదని సూచించారు.

ఓటుకు లక్ష ఇచ్చేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?

నేను రాజకీయాల్లో దశాబ్దకాలంగా పోరాడుతున్నాను. ప్రజాస్వామ్యంలో నేను ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప ఎవరికీ హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకలు ఉండకూడదని రూ.100 కోట్లు, 150 కోట్లు ఖర్చుపెడతాం అంటున్నారు. అవసరం అయితే కుటుంబానికి లక్ష రూపాయిలు ఇచ్చి ఓట్లు కొనేయమని చెబుతున్నారు. అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలే ఆలోచించాలి. మద్యపాన నిషేధం అన్న సీఎం సారా వ్యాపారిగా మారిపోయారు. వారి డబ్బు తాలూకు శక్తి నాకు తెలుసు. కానీ పిఠాపురంలోని శక్తి పీఠం అమ్మవారి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటే మనిషికి లక్ష పంచినా జనసేనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు

Exit mobile version