Home వార్తలు వైసిపి నేతల భూదాహానికి నిండు కుటుంబం బలి : వి.శ్రీనివాసరావు

వైసిపి నేతల భూదాహానికి నిండు కుటుంబం బలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రంలో వైసిపి నేతల భూదాహనికి తోడు అధికారుల అలసత్వానికి నిండు కుటుంబం బలైపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. కడప జిల్లా కొత్త మాధవరం చేనేత కుటుంబం ‘ఆత్మహత్య’పై సమగ్ర విచారణ జరిపి కారకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం. ఎటువంటి అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారులకే పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా… క్షేత్రస్థాయిలో అవినీతి తారా స్థాయిలో ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ వైసిపి నేతల అనుచరులు సుమారు 600 ఎకరాలపైగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తొలగించి అనర్హుల పేర్లను ఎక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చోటుచేసుకున్న వైసిపి నాయకుల దురాగతాలకు సర్కారే బాధ్యత వహించాలని తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో రూ.25లక్షలు చెల్లించి, తిరిగి వారి భూమిని స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు.

తనది సంక్షేమ రాజ్యమని ప్రకటించుకుంటూ నవరత్నాల పేరుతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పాలనకు చేనేత కుటుంబ ఆత్మహత్య, అనంతపురం కలక్టరేట్‌ వద్ద జరిగిన దళిత గర్భిణి మహిళ ఆకలి చావు సాక్షి భూతాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆకలి చావు సంభవించి గర్భిణి మరణించటం అందరి హృదయాలను కలిచివేసింది. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందకపోవడం శోచనీయం. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మరణానికి బాధ్యత వహించాలన్నారు.77 ఏళ్ళ స్వాతంత్య్రం అనంతరం కూడా ఆకలి చావుల సంభవించడం కేంద్ర రాష్ట్ర ప్రభాత్వాల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలి చావుతో మరణించిన ఆమె పిల్లల బాధ్యతని ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు.

Exit mobile version