Home వార్తలు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్.. కీలక వ్యాఖ్యలు

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్.. కీలక వ్యాఖ్యలు

చీకోటి ప్రవీణ్…తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయనవసరం లేని ప్రముఖుడు. క్యాసినో ఈవెంట్స్ నిర్వహణతో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఇటీవల ఆయనను ఈడీ అధికారులు విచారణ జరపడంతో మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆయన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో సమావేశం కావడం హాట్ టాపిక్ అయ్యింది. పీడీ యాక్ట్ కేసులో దాదాపు 70 రోజులకు పైగా చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజాసింగ్ నివాసానికి చీకోటి ప్రవీణ్ వెళ్లి కలిశారు.

రాజాసింగ్ తో సమావేశం అయిన తర్వాత చీకోటి ప్రవీణ్ ను మీడియా ప్రశ్నించగా తమ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పేర్కొన్నారు. పీడీ యాక్ట్ కేసులో 70 రోజులకుపైగా చర్లపల్లి జైలులో ఉండి వచ్చిన నేపథ్యంలో ఓ హిందూ వాదిగా రాజాసింగ్ ను కలిసి పరామర్శించినట్లు చెప్పారు. హింధూ ధర్మం కోసం పోరాడే వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. బలవంతపు మత మార్పిడిలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈడీ కేసుల నుండి బయటపడేందుకే తాను బీజేపీ నేతలను కలుస్తున్నాననే విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు. ఈడీ అదికారులు అడిగిన సమాచారం మొత్తం తాను ఇచ్చానన్నారు. తాను అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసిన విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. తనకు సంబంధించిన కొన్ని విషయాలను అడిగితే చెప్పానన్నారు. సినిమా తీస్తారేమో తెలియదని చెప్పారు. ఒక వేళ రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇస్తే మువీలో నటిస్తానని చీకోటి ప్రవీణ్ తెలిపారు.

Exit mobile version