Home వార్తలు Chandra Babu: లింగసముద్రం ఘటనపై తక్షణం విచారణ జరిపించాలి..! డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు..!!

Chandra Babu: లింగసముద్రం ఘటనపై తక్షణం విచారణ జరిపించాలి..! డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు..!!

Chandra Babu: ప్రకాశం జిల్లా లింగసముద్రంలో జరిగిన ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పోలీసులు ప్రవర్తించిన తీరును ఆక్షేపిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు లేఖ రాశారు. మొగిలిచర్లకు చెందిన ఆరురుగు టీడీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి పోలీసులు వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆరు నుండి పది సంవత్సరాల చిన్నారులు కూడా ఉన్నారన్నారు. పి రత్తయ్య, ఎం శ్రీకాంత్ అనే కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారనీ, టీడీపీని వీడాలని వారిపై ఒత్తిడి చేశారనీ ఆరోపించారు. అర్థరాత్రి రెండు గంటలకు స్టేషన్ నుండి వదిలిపెట్టి మళ్లీ ఉదయాన్నే 6.30 గంటలకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రావాలని బెదిరించారన్నారు.

ఈ బెదిరింపులను తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్ లు ఆత్మహత్యాయత్నంకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన తరువాత మిగిలిన వారిని పోలీస్ స్టేషన్ నుండి హడావుడిగా పంపించేశారనీ, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని లేఖలో తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పోలీసుల వేధింపులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోందని చంద్రబాబు విమర్శించారు. చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలని హితవు పలికిన చంద్రబాబు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.    

Exit mobile version