Home వార్తలు ఫించన్లు పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం : జవహార్ రెడ్డి

ఫించన్లు పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం : జవహార్ రెడ్డి

రాష్ట్రంలో వివిధ ఫించన్ల పంపిణీకి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను వెంటనే జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఫించన్లు పంపిణీ,వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు,తాగునీరు, ఉపాధి హామీ పనులు,విద్యుత్ సరఫరా పరిస్థితలు అంశాలపై ఆయన జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో ఫించన్ల పంపిణీకి సంబంధించి సిఎస్ మాట్లాడుతూ…. ఈ నెల మూడవ తేదీ నుండి గ్రామ,వార్డు సచివాలయాలు ఇతర ఉద్యోగుల ద్వారా ఫించన్ల పంపిణీకి సంబంధించి సోమవారం రాత్రికి సవరించిన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుందని కలక్టర్లకు స్పష్టం చేశారు.ఫించన్లను ఏవిధంగా పంపిణీ చేయాలనే దానిపై వివిధ జిల్లాల కలక్టర్లు,రాష్ట్ర స్థాయి అధికారుల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు.ఎండ వేడిమి, వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను,జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులను ఉ.10.30 గం.లోపు పూర్తి చేసేలా,కూలీలు పనిచేసే చోట్ల తాగునీరు, తగిన నీడ ఉండే విధంగా చూడడం తోపాటు మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.పాఠశాలలకు ఒంటిపూట బడులు జరుగుతున్నందున విద్యాశాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ స్పందించి ఉ.7.40గం.ల నుండి 12.30గం.ల వరకు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఇప్పటికే సర్కులర్ జారీ చేశారని వివరించారు.వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో ముఖ్యంగా Do’s Dont’s పెద్దఎత్తున ప్రచారం చేసి అవగాహన కల్పించాలని సూచించారు. వేసవి దృష్ట్యా మంచినీటి చెరువులు పూర్తిగా నీటితో నింపేందుకుగాను ఈనెల 4వతేదీన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు,బందరు,రైవస్ కాలువలకు,ఈనెల 8న నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తామని జిల్లాల కలక్టర్లకు చెప్పారు. కావున తాగునీటి చెరువులు నింపేందుకు విడుదల చేసే నీటిని చేపల,రొయ్యల చెరువులకు మళ్ళించకుండా చూడడం తోపాటు శివారు ప్రాంతాలకు సక్రమంగా నీరు అందేలా చూడాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.

రాష్ట్ర జల వనరులు,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ…. 20 జిల్లాల్లో సమ్మర్ కంటిన్జెన్సీ ప్రణాళికను అమలు చేసేందుకు కలక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి గల ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిసరఫరా,బోర్ వెల్స్ అద్దెకు తీసుకోవడం,బోరు బావులను ఫ్లషింగ్ లోతు చేయడం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 549 సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ లు సక్రమంగా పని చేస్తున్నట్టు తెలిపారు.2024-24లో 25.37 కోట్ల పనిదినాల లేబర్ బడ్జెట్ తో దేశంలో ఎపి రెండవ స్థానంలో రికార్డు స్థాయిలో నిలిచిందన్నారు.అలాగే 6లక్షల 49వేల 980 మందికి 100 రోజుల పనిదినాలు కల్పించి దేశంలో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో నిలవడమే గాక ఉపాధి హామీ చరిత్రలో ఆల్ టైం రికార్డు నెలకొల్పిందని చెప్పారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ…. వడగాల్పుల నుండి కాపాడుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వివిధ కరపత్రాలు, గోడపత్రికలు ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ… అన్ని విలేజ్ హెల్తు క్లినిక్లలో ఓఆర్ఎస్ పాకెట్లు,ఐవి ప్లూయిడ్లను అందుబాటులో ఉంచామని వివరించారు.అనంతరం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ సమస్య లేదని రానున్న రెండు మూడు మాసాల్లో ఎదురయ్యే విద్యుత్ డిమాండుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి,పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ కె.కన్న బాబు,విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్.కూర్మనాధ్,ఆర్డబ్యుఎస్ ఇఎన్సి కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version