ప్రతిపక్ష పార్టీలను విమర్శించలేకపోతే ఎంతటి రాజకీయ ఉద్దండులకు అయిన రానున్న ఎన్నికలకు సీట్లు లేవని అధికార వైసిపి సిగ్నల్స్ ఇస్తుంది.ఎవరు అయిన పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని,ప్రతిపక్ష పార్టీల నేతల ను,ఇతర రాజకీయ పార్టీల వారిని కలిస్తే ఉపెక్షించం అన్న తీరున వైసిపి వ్యవహరిస్తుంది.అందులో భాగంగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరలా టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ముందస్తు సంకేతాలు పంపిస్తుంది. పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి టిడిపి,జనసేన పార్టీల నేతలను విమర్శించకుండా మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. “మాగుంట అన్నా వైసిపి పార్టీలోకి రావాలి,నాన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పార్లమెంట్ సభ్యులు, మీరు పార్టీలోకి వస్తే ఒంగోలు పార్లమెంట్ నుంచి మిమ్మలని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాము” ఇది గత ఎన్నికల సమయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. ఆ హామీ ఇప్పుడు ఏమి అయ్యిందని మాగుంట అమనుచరులు ప్రశ్నిస్తున్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లో హుందాగా ప్రవర్తిస్తుంటారని,కేవలం ప్రతిపక్ష నాయకులు మీద విమర్శలు చేయకపోతే ఇలా అన్యాయం చేస్తారా అని మాగుంట అనుచరులు వైసిపి అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో టిడిపికి రాజీనామా చేసినప్పుడు కూడా చంద్రబాబును ఎక్కడ విమర్శించలేదని, ఎంపిగా ఓడిపోయినప్పటకి, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారని, క్యాడర్ నిర్ణయానికి అనుగుణంగా వైసిపిలో చేరుతున్నట్లు మాగుంట ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇతర ఎంపిలు హాజరయ్యారు. తనను సంప్రదించకుండా రేవంత్ రెడ్డిని కలవడంపై వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఎంపీల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- బాలినేని పంతం.. జగన్ అభ్యంతరం
వైసిపి తాజాగా 11 మంది ఇంఛార్జులను నియమించిన తరువాత రాజకీయం వేడెక్కింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే నాలుగు స్థానాలు వాటిలో ఉండటం విశేషం. మంత్రి గా ఉన్న ఆదిమూలపు సురేష్ ను కొండేపికి పంపించడంతో ఇక సాధారణ ఎమ్మెల్యే ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న అభ్యర్థుల్లో ఉన్నది. ఈ అనుమానాలకు చెక్ పెట్టేందుకు బాలినేని కార్యకర్తల సమావేశంలో తరుచుగా ఒంగోలు అసెంబ్లీ నుంచి తాను,ఎంపిగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తామని చెప్పుకొంటూ వచ్చారు. 2014 లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపి నుంచి పోటీ చేయడం మేరకే తాను ఒడిపోయనని,ఆ తప్పు మరలా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రికి తెలియచేశారని సమాచారం.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనకు జిల్లాలో సీట్ల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కొరిన్నట్లు సమాచారం. 2014 లో వైవీ సుబ్బారెడ్డి ఎంపి గా గెలిచినప్పటకి ఒంగోలు,దర్శి,కనిగిరి, కొండేపి అసెంబ్లీ స్థానాల్లో వైసిపి విజయం సాధించలేదని,మాగుంట తన పార్లమెంట్ పరిధిలో సేవ కార్యక్రమాల ద్వారా మంచిపనులు చేస్తున్నారని,ఒంగోలు ఎంపీ గా మాగుంట ఉంటేనే జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని వివరించినట్లు సమాచారం. ఒంగోలు అసెంబ్లీ స్థానం మాత్రం స్పష్టమైన హామీని ఇవ్వగలమని,మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి పై హామీ ఇవ్వలేమని సిఎం బాలినేని శ్రీనివాసరెడ్డి కి వివరించారని విశ్వసనీయ సమాచారం.జనవరి మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటించి వైసిపి పూర్తి ఎన్నికల వాతావరణంలోకి దిగనున్నట్లు సమాచారం.