శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్ వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ కష్టంతో సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో టిడిపి ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. మంగళవారం విడుదల చేసిన 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తుచేశారు.వైసిపి ప్రభుత్వం మాదిరిగా ఒక చేత్తో సాయం చేసి మరో చేత్తో పదింతలు జరిమానాలతో తిరిగి లాగేసుకునే మాయలు చేయమని తెలిపారు. రవాణా రంగ కార్మికుల కోసం డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.
బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్కు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.జీవో 21 రద్దు చేసి జరిమానాల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వాహనాలపై వైసిపి ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ను తగ్గించడానికి కృషి చేస్తాం. గత టిడిపి ప్రభుత్వంలో అమలుచేసిన చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి అసంఘటిత కార్మికులందరికీ వర్తింపజేస్తాం. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం. భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి సైతం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.