YSRCP: వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ నూతన కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఆశావహుల్లో ఉన్న అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలకు చోటు లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారు. అనేత అనుచరులు పార్టీపై తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేతల అనుచరులు ఆందోళన కార్యక్రామలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాల నుండి ఆదిమూలపు సురేష్ ను కొనసాగిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన బెట్టడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనిని నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పది నిమిషాల పాటు బాలినేనితో సజ్జల మాట్లాడి వెళ్లారు. త్వరలో ఆయనకు పార్టీ, ప్రభుత్వంలో ఎటువంటి గౌరవం తగ్గకుండా కేబినెట్ ర్యాంక్ స్థాయిలో ఓ పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరో పక్క బాలినేని అనుచరులు ఒంగోలులో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున బాలినేని అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుంటూరు జిల్లా మాచర్లలో సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేబినెట్ లో చోటు ఇవ్వకపోవడంతో ఆ నియోజకవర్గ పరిధిలోని అయిదు మండలాల్లోని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామూహిక రాజీనామాలు చేస్తామంటూ ప్రజా ప్రతినిధులు హెచ్చరించారు. మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రధాన రహదారిపై పిన్నెల్లి అనుచరులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తలగబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఓ మహిళా కార్యకర్తల మంటల్లో దూకి ఆత్మహత్యాయత్నం కు ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న ఇతర కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సీఎంఓ నుండి సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీరు, ప్రభుత్వం చూపిన అభిమానానికి థ్యాంక్స్ అంటూ పిన్నెల్లి ఫోన్ కట్ చేశారు. ఆ తరువాత సెల్ స్విచ్ ఆఫ్ చేశారు.
గుంటూరు జిల్లాకే చెందిన తాజా మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. ఎస్సీ మంత్రులను అందరినీ కొనసాగిస్తూ తనను మాత్రమే తప్పించారనీ, తాను చేసిన తప్పేమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా సుచరిత కుటుంబ సభ్యులు సజ్జలను కలవడానికి ప్రయత్నించినా కూడా అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. పలువురు అభిమానులు, దళిత సంఘాల నేతలు సుచరిత నివాసానికి చేరుకుని ఆమెకు మద్దతు గా నిలుస్తున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. కాకాని గోవర్థన్ రెడ్డికి పార్టీలోకి ఎవరు తీసుకువచ్చారో అందరికీ తెలుసునని సన్నిహితుల వద్ద ఆయన వాపోయారు. అయితే సీఎం జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని కోటంరెడ్డి పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు అందరూ రేపు సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉదయభాను అనుచరులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి బైక్ పై పెట్రోల్ పోసి తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు.