Big Breaking: కొండెపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు రూ.1724 కోట్ల అవినీతి పాల్పడ్డారంటూ నిన్న ఆరోపణలు గుప్పించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు స్పందించారు. స్వామి ఆరోపణలను తిప్పి కొట్టడంతో పాటు టీడీపీపై ఘాటుగా విమర్శలు చేశారు. ఈ పరిణామాలతో ఒంగోలు, కొండపి ప్రాంతాల్లో పరిస్థితులు వెేడెక్కాయి. ఎమ్మెల్యే స్వామి ఇంటి చుట్టూ పలువురు వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు. దీంతో స్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారంటూ టీడీపీ ఆరోపించడంతో ఏదో జరుగుతోంది అన్నట్లుగా గందరగోళం నెలకొంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే స్వామిపై నిఘా పెట్టారనీ, ఆయన కదలికలను గమనిస్తున్నారని, ఆయనపై దాడికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే జరిగితే చూస్తూ ఊరుకోమని టీడీపీ హెచ్చరిస్తోంది. మరో పక్క ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి వెళుతున్న వరుకుటి అశోక్ బాబు, అతని అనుచరులను టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో అడ్డుకున్న పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు.
ఈ ఘటనపై టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందించారు. మంత్రి బాలినేని అవినీతిని ప్రశ్నించిన దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిపై దాడి చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు ఉందని, ఆ హక్కులను సైతం వైసీపీ ప్రభుత్వం హరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం నియంతృత్వ పోకడల రాజ్యం ఏలుతుందని విమర్శించారు. స్వామిపై ఈగ వాలినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, ప్రతి కార్యకర్త తిరగబడతారని ఏలూరి హెచ్చరించారు. చేతనైతే ఆరోపణలపై చర్చకు వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు ఏలూరి. ముఖ్యమంత్రితో సహా అవినీతి మంత్రులందరి అవినీతి చిట్టాలను, వైఫల్యాలను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ బయటపెడుతుందని అన్నారు ఏలూరి. ఎమ్మెల్యే స్వామి పై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఏలూరి ఖండించారు. సభ్య సమాజం తలదించుకునేలా దిగజారి సుధాకర్ మాట్లాడడం దారుణమని అన్నారు.