Home వార్తలు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసులో ఏపిలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనీ, దర్యాప్తులో తాత్సారం జరుగుతోందని, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కేసులు కూడా నమోదు చేశారని కావున ఏపి నుండి ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివేకా కుమార్తె వాదనలకు సమర్ధిస్తూ సీబీఐ కూడా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై తీర్పు సందర్భంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో సాక్షధారాలు నాశనం చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తుపై మృతుడి భార్య, కుమార్తె వివేకా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడి (సుప్రీం కోర్టు) వరకూ రావడం బాధాకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది, పిటిషనర్ల ప్రాదమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసు విచారణను బదిలీ చేస్తున్నట్లుగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు తప్పడం లేదని, విచారణకు స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉందనీ, అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్షాలను ధ్వంసం చేశారనీ, ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగించాలనీ, కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నామనీ, అందుకే కేసును హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది.

Exit mobile version