YS Jagan: విశాఖలోని శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలకు నిన్న సీఎం వైఎస్ జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం పర్యటనను పురస్కరించుకుని విశాఖలో పోలీసులు టాఫిక్ ఆంక్షలు కఠినతరం చేశారు. పోలీసుల ఆంక్షలతో ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ లో చిక్కుకున్నందు వల్ల విమానం మిస్ అవుతుందేమో అని ప్రయాణీకులు ఆందోళన చెందారు. ఓ మహిళా ప్రయాణీకురాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే భైటాయించి ఆందోళన చేస్తానని ప్రకటించారు.
విమానాశ్రయంకు వెళ్లే దారిలో రెండు మూడు గంటల పాటు వాహనాలు నిలిపివేస్తే ఎలా అంటూ ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు మీడియాలో ప్రసారం కావడంతో సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనను పురస్కరించుకుని గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని జగన్ ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.