Yeluri Sambasivarao: వైసీపీ ప్రభుత్వ పాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆందోళనకు సమాయత్తం అవుతోంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతుందని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 28న ఇంకొల్లు మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు జరిగే నిరసన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పన్నుల భారంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఏలూరి అన్నారు. పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏలూరి ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ ధరల పెంపుతో వ్యవసాయం భారంగా మారిందని అన్నారు. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మళ్లీ పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. డిసెంబర్ 2020లో రూ. 681 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా రూ.900కు పెరిగిందన్నారు. కరోనా కష్ట కాలంలోనూ ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపిందని విమర్శించారు.
ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు తక్షణమే చేపట్టాలని ఏలూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందని అన్నారు. మద్య నిషేధం అమలు చేస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యంతో ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు.