TDP letter to Central Minister: వెలిగొండ ప్రాజెక్ట్ ను తక్షణమే గెజిట్ లో చేర్చాలని, తమకు ప్రత్యేక సమయం కేటాయించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు లేఖ రాసారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్ట్ లేకపోవడంపై వీరు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఏపి సిఎం వైఎస్ జగన్ కు ఇప్పటికే మూడు లేఖలు రాసారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో కేంద్ర జలశక్తి మంత్రి కి లేఖ రాసారు.
విభజన చట్టంలో వెలిగొండ ప్రాజెక్టు ను అధికారికంగా గుర్తించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే గెజిట్ లో చేర్చాలని కోరారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయిని అని, ప్రకాశం జిల్లాతో పాటు మరో రెండు జిల్లాల తాగు సాగునీటి అవసరాల కోసమే ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. కరువు జిల్లా ప్రజల గొంతు కోయొద్దని విజ్ఞప్తి చేసారు. వెలిగొండ ప్రాజెక్టుతోనే ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, వెలిగొండ లేకుంటే ప్రకాశం జిల్లా ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్ పైనే ఆధారమని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా ప్రజల బాధలు గాధలు వినేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు కేంద్ర మంత్రి ని కోరారు.