Yeluri Sambasivarao: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయించడం సిగ్గుమాలిన చర్య అనీ తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ నేతలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ శ్రేణుల దాడిని సాంబశివరావు పలువురు టీడీపీ శ్రేణులతో అడ్డుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది చేతకాని చవట రాజకీయం అని విమర్శించారు. వైసీపీ గుండాలు ప్రతిపక్షనేత ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
అధికార మదం తో వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఇంటిపై జరిగిన దాడికి రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటన పిరికిపంద చర్యకు నిదర్శనమని ఏలూరి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించలేని డీజీపీ..తన పదవి నుంచి తప్పుకోవాలని ఏలూరి డిమాండ్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేస్తేనే రక్షణ కల్పించలేని పోలీసులు ప్రజల ప్రాణాలకు ఏమి రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఏలూరి హెచ్చరించారు.