Gottipati Ravikumar: “రాష్ట్రం మరో ఆఫ్ఘనిస్థాన్లో మారుతోంది, జడ్ ప్లస్ భద్రత ఉంటే రౌడీ మూకలు ఎలా వెళ్లారు? శాంతి భద్రతల పూర్తిగా సన్నగిల్లాయనడానికి ఇదే నిదర్శనం. ఇంత దుర్మార్గ పాలనను ఎన్నడూ చూడలేదు” అంటూ టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే బరితెగించి ప్రవర్తిస్తున్నారని రవికుమార్ దుయ్యబట్టారు. శాంతియుత పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి దిగిపోవాలని, అంత తప్ప ప్రతిపక్ష నాయకులపై మీ చెంచాలతో దాడి చేయించడం ఏమిటంటూ నిలదీశారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిని రౌడీమూకలతో కలసి బాధ్యత కలిగిన ఎమ్మెల్యే జోగి రమేష్ ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండించారు.
Gottipati Ravikumar: జోగి రమేష్ కి ఏం పని..!?
పెడన నియోజకవర్గానికి చెందిన జోగి రమేష్ ఉండవల్లిలో చంద్రబాబు ఉండే నివాసానికి వచ్చి దాడిచేయాల్సిన అవసరం ఏముంది.. మొత్తం ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రోద్భలంతోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారని విమర్శించారు. విషయం తెలుసుకుని చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనా వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడటం శోచనీయమని.., రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చూస్తుంటే,ఆంధ్రప్రదేశ్ మరో ఆఫ్ఘనిస్థాన్లా మారుతోందన్న ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, చెత్త రాజకీయాలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఎవరినీ కించపరిచేలా లేవన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా, పౌరహక్కులను ప్రశ్నించేలా మాత్రమే అయ్యన్న వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిని సాకుగా తీసుకున్న ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు చంద్రబాబు ఇంటిని ముట్టడించి రాళ్లదాడికి పాల్పడటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటకలిసిందని, శాంతి భద్రతలు లేవనటానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలని ఆయన ప్రశ్నించారు.
అఘాయిత్యాలు ఆపలేరా..!? డీజీపీ ఎందుకున్నట్టు..!?
“గడిచిన రెండున్నరేళ్లుగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మాజీ మంత్రి నారాలోకేశ్ పై వైసీపీ నేతలు అత్యంత నీచంగా,జుగుప్సాకరంగా మాట్లాడిన తీరును అసహ్యించుకోని పౌరుడంటూ లేడు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబు ఇంటిపైనే రాళ్లదాడి చేసి,ఆందోళన చేస్తుంటే, డీజీపీ గౌతం సవాంగ్ ఏం చేస్తున్నారు. ఆడ పిల్లలపై అఘాయిత్యాలు,వైఫల్యాలను వేలెత్తి చూపిస్తేనే,వైసీపీ ఏజెంట్లా ప్రతిపక్ష నేతలంటూ డీజీపీ విమర్శలు చేశారని,మరి చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనకు ఏం సమాధానం చెప్తారు..!? నిన్నటి నుండే.. దాడి చేస్తాం, తాట తీస్తాం అంటూ హెచ్చరిస్తుంటే పోలీసులు స్పందించలేదని, అందుకు బాధ్యులైన వారిపై డీజీపీ సవాంగ్ చర్యలు చేపట్టాలి” అని రవికుమార్ డిమాండు చేశారు.