Breaking: తీవ్ర సంచలనం సృష్టించిన సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో నాష్కల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆ మృతదేహం నిందితుడు రాజుదిగా నిర్ధారించారు. నిందితుడు రాజు మృతిని డీజీపీ మహేందర్ రెడ్డి దృవీకరించారు. అయితే బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని తమ కళ్లతో చూసిన తరువాతే నమ్ముతామని చెబుతున్నారు. చాలా మంది టాటూలు వేయించుకుంటారనీ, మృతదేహాన్ని ఒక సారి సైదాబాద్ తీసుకువచ్చిన తమకు చూపించాలని కోరుతున్నారు.
స్టేషన్ ఘన్ పూర్ వద్ద రాజు మృతదేహాన్ని గుర్తించామనీ, నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా నిర్ధారించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9న సైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన తరువాత నిందితుడుగా ఉన్న రాజు పరారు అయ్యాడు. పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, ప్రజల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిందితుడిని ఉరి తీయాలని కూడా పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడి ఆచూకి తెలిపిన వారికి పోలీసులు పది లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఆటోలు, బస్సులు, ఇతర బహిరంగ ప్రదేశాలల్లో పోస్టర్ లతో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. సుమారు వెయ్యి మందికిపైగా పోలీసులు సిబ్బంది ఈ గాలింపు చర్యలో పాల్గొన్నారు.
నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగానే స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిని అన్ని వైపులా చుట్టుముట్టడంతో రాజు ఆత్మహత్య కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు కొనసాగుతున్న నేపథ్యంలో రాజు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే భావించారు. ఆ క్రమంలోనే రైల్వే ట్రాక్ పై గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు మార్చురీల్లో భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించారు. ఈ అయిదారు రోజులుగా రైల్వే ట్రాక్ లపై మృతి చెందిన వారి వివరాలపైనా పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో పోలీసులు ఊహించినట్లుగా రాజు మృతదేహం రైల్వే ట్రాక్ పై లభించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.