YCP vs TDP: ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ ఇన్ చార్జి వరికూటి అశోక్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్చ భారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ చలో తూర్పు నాయుడుపాలెం అంటూ ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి అశోక్ బాబు పిలుపునిచ్చారు. వైసీపీకి కౌంటర్ గా చలో టంగుటూరు అంటూ టీడీపీ శ్రేణులు వైసీపీ ఇన్ చార్జి కార్యాలయం ముట్టడికి సిద్దమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తూర్పు నాయుడుపేటలోని ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద కు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ నిరసన కార్యక్రమాల పిలుపు నేపథ్యంలో తూర్పు నాయుడుపాలెం, టంగుటూరు గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
ఈ సందర్భంలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడుతూ…తాను గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన సమయంలో ఇదే రకమైన డ్రామా ఆడారనీ, దానికి పలితంగా ఆయన ఇన్ చార్జిగా వచ్చాడన్నారు. ఆ తర్వాత సంగమేశ్వర ప్రాజెక్టు వద్ద తాము అన్నదానం చేస్తుండగా, తనను సొంత పార్టీ వారు వ్యతిరేకిస్తుండటంతో దాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఇదే నాటకం ఆడారని అన్నారు. ఆ రోజు మా కార్యకర్తలను సంయమనం పాటించమని చెప్పామన్నారు. ఆ రోజు ఉద్రిక్తత కలుగజేసినప్పటికి కూడా వేలాదిగా మేము ఉండి, పదుల సంఖ్యలో వాళ్లు ఉండగా మేము ఉద్రిక్త పరిస్థితి రాకుండా చేశామన్నారు. మరల ఈరోజు తాను అవినీతి చేశానని ఆరోపిస్తూ మళ్లీ వస్తున్నాడన్నారు. దాన్ని చూసి ఎటువంటి పిలుపు లేకుండా సోషల్ మీడియాలో ఆయన పిలుపు చూసి మ పార్టీ కార్యకర్తలు స్వచ్చందంగా మోటివేట్ అయి వచ్చారన్నారు. వాళ్లు గనుక న్యూసెన్స్ చేస్తే మా కార్యకర్తలు ఊరుకోరు అని పోలీసులకు చెప్పానన్నారు ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి. కార్యకర్తలు విసిగిపోయి ఉన్నారన్నారు.
రైతు వారీ శాంతియుత నియోజకవర్గం అయిన కొండెపిలో రెచ్చగొట్టడాలు, రౌడీయిజం చేయడం, తప్పుడు ఆరోపణలు చేయడం మంచిపద్దతి కాదని మేము సంయమనం పాటించామన్నారు. వాళ్లకు బుద్ది చెప్పాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నారన్నారు. గత ఎన్నికల్లో ప్రజా విజయంగా రిజర్వుడు నియోజకవర్గంలో నేను రెండో సారి గెలిచానన్నారు. ఆ రోజు ఇన్ చార్జిగా ఉన్న అతను ఎందుకు మాట్లాడలేకపోయాడని ప్రశ్నించారు. ఈ రోజు ఏదో లబ్దికోసం ఇది చేస్తున్నాడన ఆరోపించారు. నేను అవినీతి చేసి ఉంటే ప్రభుత్వం మీదే ఉంది విచారణ చేయించమని ముఖ్యమంత్రి ఇంటి వద్దనో లేక సజ్జల ఇంటి వద్దకో వెళ్లి ధర్నా చేయాలని సూచించారు. నీవు ఏది మాట్లాడినా జనాలు నమ్మే పరిస్థితి లేదన్నారు. శాంతియుత నియోజకవర్గాన్ని వేరే మార్గంలో చేయవద్దని ఎమ్మెల్యే స్వామి హితవు పలికారు. వైసీపీలో ఇద్దరు ముగ్గురు ఇన్ చార్జి కోసం పోటీలు పడుతున్నారనీ, ఇటువంటి చర్యలు చేస్తే పార్టీ బీ ఫారం వస్తుందని ఆశపడుతున్నారన్నారు. దాని కోసం శాంతియుత నియోజకవర్గంలో అశాంతి నెలకొల్పే చర్యలకు పాల్పడవద్దంటూ హితవు పలికారు.