టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై కొందరు దుండగులు నెల్లూరులో ఇవేళ దాడికి యత్నించారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలో పది మంది బైకులపై వచ్చిన వ్యక్తులు కర్రలతో ఆనం వెంకట రమణా రెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన టీడీపీ కార్యకర్తలు అప్రమత్తపై అడ్డుకోవడంతో ఆ వ్యక్తులు బైకులు, కర్రలు అక్కడే వదిలి పరారైయ్యారు. వైసీపీ కార్యకర్తలే దాడికి యత్నించారని ఆనం అనుచరులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసినందుకే దాడికి యత్నించారన్నారు.
అనం వెంకట రమణారెడ్డిపై దాడి వైసీపీ పనే అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఉలికిపాటు అని ప్రశ్నించారు లోకేష్. తెలుగుదేశం పార్టీ గొంతుకను బలంగా వినిపిస్తున్న ఆనం వెంకట రమణా రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకి తగిన గుణపాఠం చెబుతాని ఆయన హెచ్చరించారు. టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డిపై దాడి యత్నాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఖండించారు. సైకో చర్యలకు సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అనం వెంకట రమణారెడ్డిపై దాడి యత్నాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు.