వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణకు చేదు అనుభవం ఎదురైంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందించేందుకు వెళ్లగా అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడంతో వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంకు చెందిన పదో తరగతి విద్యార్ధిని సహచర బాలురు నిన్న పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన రాజోలులో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వేళ ఉప్పలవారిపాలెంలో బాలుడి అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ గ్రామానికి వచ్చారు.
అయితే ఎంపీని గ్రామంలోకి రావొద్దంటూ బాలుడి బందువులు, స్థానికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం ఉంటున్న ఇంటి వద్దకు ఎంపిని వెళ్లకుండా అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగితే తీరిగ్గా పరామర్శించేందుకు వచ్చారా అంటూ గ్రామస్తులు ఎంపీని నిలదీశారు. తాను వ్యక్తిగతంగా కలిసి లక్ష ఆర్ధిక సాయం అందించేందుకు వచ్చానని మోపిదేవి చెప్పగా, “మేమే కు లక్ష ఇస్తాం.. దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపోండి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని గ్రామస్తులు హెచ్చరించారు. దీంతో చేసేది ఏమి లేక మోపిదేవి అక్కడ నుండి వెళ్లిపోయారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి పికెట్ ఏర్పాటు చేశారు.