Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకాశం జిల్లా వైసీపీ కీలక నేత ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకున్న ఆమంచి స్వాములుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ పర్చూరు ఇన్ చార్జి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు. ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారని చాలా రోజుల నుండి వార్తలు వినబడుతున్నాయి. ఇంతకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చలు జరిపిన ఆమంచి స్వాములు ఇవేళ అధికారికంగా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చీరాల నుండి ఆమంచి స్వాములు పార్టీలో చేరడం సంతోషకమని అన్నారు. తాను చీరాలలో పెరిగాననీ, చీరాల అనగానే చిన్న రథం, పెద్ద రథం, జాలరీ పేట గుర్తుకొస్తాయని అన్నారు. ఆమంచి స్వాములుకు చీరాలలోనే బలం ఉందని తాను అనుకున్నాననీ, కానీ విజయవాడ, గుంటూరు, ప్రకాశం నుండి కూడా అభిమానులు ఉంటారని అనుకోలేదన్నారు. వచ్చిన అభిమానులు, కార్యకర్తలను చూసి ఆశ్చర్యపోయానన్నారు. అమంచి శ్రీనివాసులను మనస్పూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడు, కష్టం వస్తే నేను ఉన్నా అని నిలబడే వ్యక్తి స్వాములు అని అన్నారు. స్వాములు రాకతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జనసేనకు బలం వచ్చినట్లేనన్నారు. ఆమంచి కుమారుడు రాజేంద్ర కూడా పార్టీలో చేరడం యువత మార్పునకు చిహ్నమన్నారు.
ఈ సందర్భంగా ఆమంచి స్వాములు మాట్లాడుతూ .. వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. జగన్ ప్రభుత్వ విధి విధానాలతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పవన్ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా మనమంతా ఆయనకు తోడుగా నిలబడాలన్నారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ లకు కొండంత అండగా ఉండే జనసేన పార్టీలో చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.