ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో పది మంది పైగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలుతో పాటు ఒక వృద్ధుడు ఉన్నారు. వివరాల్లోకి వెళితే పొదిలికి చెందిన వారు కాకినాడలో వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొనేందుకు ఒంగోలు ఆర్టీసీ డిపో బస్సును అద్దెకు తీసుకున్నారు. వీరంతా పొదిలి నుండి కాకినాడకు వెళుతుండగా, దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.
విషయం తెలియడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తొంది. పెళ్లి బృందం బస్సు ఎక్కిన అరగంట వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఎదురుగా వస్తున్న లారీను తప్పించపోయి సాగర్ కాలువలో బస్సు పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు క్షతగాత్రులు తెలుపుతుండగా, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించారు.
మరణించిన వారిలో పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ ఫ్లాజిజ్ (65), అబ్దుల్ హనీ (60), షేక్ రమీజ్ (48), ముళ్ళ నూర్జహాన్ (58), ముళ్ళ జానీ బేగం (65), షేక్ సబీనాగా గుర్తించారు. కాగా ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనతో పొదిలి గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.