దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ మంజూరు చేయగా, దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈడీ.
అయితే ఇవేళ మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ఈడీ వ్యతిరేకించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాఘవలను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్ గ్రూప్లో రాఘవ కీలక పాత్రధారిగా ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈడీ కేసులో దినేష్ అరోరా త్వరలో అప్రవర్గా మారనున్నారు. గతంలో సీబీఐ కేసులో దినేష్ అరోరా అప్రూవర్గా మారారు.