Visakha: విశాఖ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలాన్ని రేపింది. విశాఖ జిల్లాలోని రోలుగుంట మండలం జే నాయుడుపాలెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదం ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జగ్గంపేట నాయుడుపాలెం గ్రామానికి చెందిన నాగగరాజుకు ఆరేళ్ల క్రితం సాయితో వివాహం జరిగింది. వీరికి భాను (5), పృద్వీ (3) పిల్లలు ఉన్నారు. నాగరాజు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సాయి గృహిణిగా ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. అయితే భార్య, భర్తల మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన సాయి తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేయగా ఇద్దరు పిల్లలు అప్పటికే మృతి చెందారు. తల్లి సాయిని ప్రాణాలతో కాపాడగలిగారు. స్థానికుల సాయంతో బావిలోని పిల్లల మృతదేహాలను పోలీసులు వెలికితీసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విగతజీవులుగా ఉన్న ఆ పసివాళ్ల మృతదేహాలను చూసి గ్రామం అంతా కంటతడిపెట్టుకుంది.