TDP Letter to Central Minister: ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన, కరువు జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి ఆదుకోవాలని టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. తమ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను సవివరంగా విన్నవించుకునేందుకు తమకు తగు సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తదితరులు లేఖలో కోరారు.
ప్రకాశం జిల్లా ఏర్పాటు, భౌగోళిక పరిస్థితులు, జిల్లా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు లేఖలో ప్రస్తావించారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సరైన వర్షాలు లేక, సాగు, తాగు నీటి వనరులు, అభివృద్ధికి నోచుకోక పంట భూములు బీడు భూములుగా మారాయన్నారు. సరైన రహదారి సౌకర్యం లేక, పరిశ్రమలు రాక, జిల్లా నుంచి ప్రజలు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలుగా వరుస కరువు వెంటాడుతున్నా జిల్లా పై రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపడం లేదన్నారు. ఇప్పటి వరకు జిల్లా అభివృద్ధికి అడుగులు పడలేదన్నారు. ఏపిలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజిని పరిగణలోకి తీసుకుని ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించిందనీ, కానీ ప్రకాశం జిల్లా ఆ జాబితా లేదన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో వెనకబడిన జిల్లాలకు వచ్చే సదుపాయాలను కల్పించిందని పేర్కొన్నారు. కీలక ప్రాజెక్టులైన రామాయపట్నం పోర్టు, కాగిత పరిశ్రమ, ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, చేనేత కార్మికులకు ప్రత్యేక కేటాయింపులు చేసిందన్నారు. ఏషియన్ పేపర్ మిల్లు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. అయితే తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్ళుగా ఒక్క రూపాయి విడుదల చేయలేదని వివరించారు. ఒక్క పరిశ్రమ కూడా జిల్లాకు తీసుకరాలేదనీ, ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోయాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు కూడా గత రెండు సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్నాయన్నారు. జిల్లా వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లాకు చేయూత అందిస్తారని కోరారు.
కేంద్ర మంత్రికి పంపిన లేఖ ఇదీ..