Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం మండలం రాయవరం రైల్వే వంతెనపై టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ముంపు ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యకర్తల పేర్లు ఆన్ లైన్ చేయడం లేదని ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. టీడీపీ నేతలు కందుల నారాయణరెడ్డి, ఎరిక్షన్ బాబు తదితర నేతలు, కార్యకర్తలు రోడ్డుపై భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
వెలిగొండ ప్రాజెక్టు ముంపులో ఉన్న సుంకేసుల గ్రామంలో 300 కుటుంబాల పేర్లు గతంలో ప్రభుత్వం నిర్వాసితుల జాబితాగా ప్రకటించిందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన జాబితాలో 160 మందికి పైగా పేర్లు లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న కారణాలు చూపి ప్రభుత్వం తమకు ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.