TDP News: టీడీపీ ఎస్టీ సెల్ మరింత బలోపేతం అయ్యేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఇసుకదర్శిలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎస్టీ సెల్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. బాపట్ల పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ ఎస్టీలను రాజకీయంగా ప్రోత్సహించి వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం కోసం కమిటీల పునర్నియామకం చేపట్టినట్లు తెలిపారు. ఎస్టీ సామాజికవర్గ అభివృద్ధికి టీడీపీ ఒక పటిష్ట ప్రణాళిక రూపొందించిందని చెప్పారు.
ఎస్టీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక పథకాలను తీసుకువస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటినీ నిలిపివేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధ చేతకాని పాలనతో యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అప్పులు తేవడంపై ఉన్న శ్రద్ద రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించడంపై లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా సమస్యలప పోరాటం చేసే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్దులు కావాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్యే ఏలూరిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మద్దుల అంకాలు, తెలుగు మహిళా కార్యదర్శి మిరియాల వెంకట రమణ, నియోజకవర్గ నాయకులు గాంధీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.