Vasavi Temple: ప్రతి ఏటా విజయదశమి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటుంటారు. నవరాత్రులు అమ్మవారికి రోజుకు ఒక ప్రత్యేక అలంకారం చేసి పూజలు జరుపుతుంటారు. ఆలయాలతో పాటు వివిధ కూడళ్ల వద్ద పందిళ్లు వేసి అమ్మవారిని కొలువుతీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. పలు ప్రాంతాల్లో అమ్మవారి అలంకారానికి నిర్వహకులు లక్షలాది రూపాయల కరెన్సీని ఉపయోగిస్తుంటారు. వాసవీ అమ్మవారి ఆలయాల్లో ఆలయ నిర్వహకులు ప్రతి ఏటా అమ్మవారికి కరెన్సీతో అలంకారం చేస్తారు. కరెన్సీ అలంకారంలో ఉన్న అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని పూజలు చేస్తుంటారు.
ప్రతి ఏటా మాదిరిగానే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ నిర్వహకులు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం అమ్మవారి విజయ ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ.25లక్షల నగదుతో కమిటీ వారు అమ్మవారిని, ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ అలంకరణలో రూ.5,10, 20, 50, 100, 500, 2000 కరెన్సీ నోట్లు ఉపయోగించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆలయం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.