విద్యుత్ షాక్ తో ఓ బాలుడు, పిడుగు పడి మరో వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం జరిగింది. విద్యుత్ షాకుతో బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం మార్కుపురం మండలంలోని మాల్యవంతునిపాడు గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దొడ్డా లక్ష్మిరెడ్డి(14) పిల్లలతో కలిసి గ్రామంలోని రామాలయం వద్ద ఆడుకుంటూ పొరపాటున అక్కడ ఉన్న కరెంట్ స్విచ్ బోర్డును తాకాడు. దాంతో కరెంట్ షాక్కు గురై అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ సూరానా అంకిత మహావీర్, సీఐ భీమానాయక్, ఎస్ ఐ రుద్రపాటి సుమన్లు సంఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లవాండ్లపల్లి గ్రామంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు (45) గొర్రెలను మేపు కునేందుకు పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఆ సమయంలో పిడిగుపడి బండి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంకటేశ్వర్లు బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంకటేశ్వర్లుకు భార్య, కూతురు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృత దేహాన్ని వీఆర్ఓ అనురాధ పరిశీలించి వివరాలు నమోదు చేశారు.