వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా ? అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. శుక్రవారం మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశంలో అత్యంత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ కర్నూల్ లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగిందా? సిబిఐ వాళ్ళనే కర్నూల్ నుంచి పారద్రోలించిన అవినాష్ రెడ్డి అమాయకుడా అని నిలదీశారు. మీ మాటలు వ్యవస్థలను కించపరిచే విధంగా లేవా అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సిబిఐ స్పందించాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి చిన్న బాలుడు అమాయకుడు అని చెబితే కడప పార్లమెంట్ ప్రజలు, రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని 11 చార్జీ షిట్ల పై జగన్మోహన్ రెడ్డి కోర్టులకు హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్.. డ్రామా యాక్టర్..అబద్ధాల కోరు
జగన్మోహన్ రెడ్డిపై అసలు హత్యాయత్నమే జరగకపోతే ఇంకా ప్లాస్టర్ వేసుకొని తిరగడంలో ఏమైనా ఔచిత్యం ఉందా? రాష్ట్ర ప్రజలు ఎంత అమాయకులని అనుకుంటున్నారా ?అని ప్రశ్నించారు.సిఎం అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి పెద్ద యాక్టర్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఐ ప్యాక్ సృష్టించిన గులకరాయి దాడి పెద్ద డ్రామా అని పేర్కొన్నారు. ఏదో రకంగా ప్రజలను మాయచేసి అధికారాన్ని కాపాడుకొనేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదని దుయ్యబట్టారు.