AP Special Status: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన అధ్యాయం అంటూ ఇప్పటి వరకూ కేంద్ర పెద్దలు చెబుతూ వచ్చారు. ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక హోదాకు గత టీడీపీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్రం చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం శుభపరిణామంగా భావిస్తున్నారు. దీంతో ప్రత్యేక హోదా అంశం కదలిక వచ్చినట్లు కనబడుతోంది.
త్రిసభ్య కమిటీకి కేంద్ర హోంశాఖ సెక్రటరీ అశిష్ కుమార్ నేతృత్వం వహిస్తుండగా ఏపి ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుండి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కమిటీ మొదటి సమావేశం జరుగుతోంది. మొత్తం తొమ్మిది అంశాలతో కూడిన అజెండా తో సమావేశానికి సిద్ధం కావాలని ఇరు రాష్ట్రాలకు కేంద్రం సమాచారం పంపింది. విభజన చట్టంలోని షెడ్యుల్ 9, 10 లోని సంస్థల విభజన సహా ఇతర అపరిష్కృత అంశాలపై కమిటీ చర్చించనుంది. ఏపి ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన, విద్యుత్ వినియోగ అంశాలు, పన్ను అంశాల్లో సవరణలు, బ్యాంకు డిపాజిట్ల పంపిణీ, ప్రత్యేక హోదా తదితర అంశాలు సమావేశ అజెండాలో పొందుపర్చారు