Home వార్తలు హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో చేసిన అభివృద్ధి గుర్తుకు వస్తుంది. దీనితో పాటు మూడేళ్ల క్రితం విజయనగరం రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను తొలగించిన దారుణ ఘటనా గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. రథాలు తగలబడ్డాయి. అర్చకుల పై దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.కలియుగ వైకుంఠ దైవం తిరుమల ఏడుకొండల పుణ్యక్షేత్రంతో సహా అనేక హిందూ దేవాలయాల పవిత్రత దెబ్బతీసే అనేక చర్యలు జరిగాయనీ పేర్కొన్నారు. కానీ ఏ ఒక్క ఘటనలోనూ నిందితులు అరెస్టు కాలేదు. భక్తుల మనోభావాలు కాపాడేందుకు ఏ ఒక్క ప్రయత్నమూ ప్రభుత్వం చెయ్యలేదని విమర్శించారు. ‘హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు’ అనదగ్గ సుమారు 160 ఘటనలు జరిగినా ప్రభుత్వం అది సమస్యే కాదన్నట్లు అలక్ష్యం చేయడం భక్తులను మరింత బాధించిందని తెలిపారు. రామతీర్థం ఆలయంలో రాములోరి తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో పడేసి పోయారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంటిమిట్ట మాదిరిగా రామతీర్థం దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ది చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల రక్షణకు, పవిత్రతను కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు.

Exit mobile version