రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం నిర్వహించిన న్యాయ యాత్ర లో ఆమె మాట్లాడుతూ…ప్రతి మహిళ పేరు మీద రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మిస్తాం. వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు . హంద్రీనీవా ప్రాజెక్టు పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 90 శాతం పూర్తి చేస్తే…. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి 10 శాతం పనులను పూర్తి చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో టీడీపీ, వైసీపీ ప్రజలను మోసం చేశాయే తప్ప అభివృద్ధి చేసింది శూన్యం అని విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని వారసుడి పాలనలో ఎక్కడికి పోయిందని నిలదీశారు. అధికారంలోకి వస్తే హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి .. ఆ హామీని మరిచారని విమర్శించారు. ఇండిస్టియల్ కారిడార్ తీసుకొస్తామన్నారు.ఒక్క పరిశ్రమ అయిన తీసుకువచ్చారా ? మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఏపి గురించి పట్టించుకోని జగన్ అవసరమా ?
ఐదేల్లుగా కోటలు కట్టుకున్న జగన్.. ఎన్నికలు ఉన్నాయని సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారన్నారని మండిపడ్డారు. ఏనాడైనా ప్రజల సమస్యలను విన్నారా ? ఏపీ గురించి పట్టించుకోని జగన్ అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వద్ధ జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో బిజెపి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రానికి హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు.