Sai Dharam Tej: సిినీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు పేర్కొన్నారు. సాయి తేజ్ శరీరంలో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అయితే కాలర్ బోన్ విరగడంతో సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. కొద్ది సేపటి క్రితం వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. మరో 24 గంటలు వెంటిలేటర్ పైనే సాయి తేజ్ కి ట్రీట్మెంట్ అందించనున్నారు.
స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ మొన్న రాత్రి సాయి తేజ్ కేబుల్ బ్రిడ్జ్ దాటిన తరువాత స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి తేజ్ ను ముందుగా సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అనంతరం సాయి తేజ్ మేనమామలు చిరు, పవన్ కల్యాణ్ తదితర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అపస్మారక స్థితి నుండి కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు ట్వీట్స్ చేస్తున్నారు.