Prakasam Police: ఏ శాఖలోనైనా జిల్లా అధికారుల ఆలోచనలకు అనుగుణంగా సిబ్బంది నడుచుకుంటారు. ఒక్కో జిల్లాలో అధికారులు తమ మార్క్ ను చూపించడం కోసం ఆ శాఖలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. అవి సిబ్బంది, ప్రజల మన్ననలు పొందుతుంటాయి. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన వెళ్లిన సిద్ధార్ద్ కౌశల్ తన దైన శైలిలో జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నడిపించారు. ప్రజలతో పాటు రాజకీయ పక్షాల మన్ననలు పొందారు.
అదే రీతిలో ప్రస్తుతం ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లికా గార్గ్ కూడా తన దైన శైలిలో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో ఒంగోలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్ లో పని చేసే సిబ్బంది అంతా ఒకే కుటుంబం అనే భావన వచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అనుమతితో మహిళా కానిస్టేబుల్ స్రవంతికి పోలీస్ స్టేషన్ లోనే సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుభాషిని పాల్గొని ఆమెకు చీరా, సారెతో సత్కరించి దీవించారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుళ్లు అందరూ పాల్గొని స్రవంతికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ సుభాషిణి మాట్లాడుతూ..స్టేషన్ లో విధులను నిర్వహించే సిబ్బంది మొత్తం ఒకే కుటుంబంలా మెలుగుతామన్నారు. దీనికి ఈ కార్యక్రమమే నిదర్శనమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో ఈ వేడుకను జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అనుమతితో నిర్వహించినట్లు చెప్పారు.