ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నలుగురు డిజైన్ కార్మికులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే…విజయవాడ నగరానికి చెందిన పిల్లి శ్రీను (35), చంద్రశేఖర్ (33), కే శ్రీను (22), సాయి (32) మరో ఇద్దరు శుభకార్యాల్లో అలంకరణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా వీరు అనంతపురంలోని ఓ శుభ కార్యానికి వెళ్లారు. అక్కడ అలంకరణ పనులు పూర్తి అయిన తర్వాత కారులో విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని పౌర సరఫరాల గోడౌన్ వద్ద ఎదురు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
విజయవాడ నుండి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు వీరి కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీను, సాయి, చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కె శ్రీను అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అశోక్, కొయ్యని రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ముగ్గురి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీసారు.
అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. త్రిపురాంతకం సీఐ వెంకట సైదులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక నిద్రమత్తు కారణంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఆర్టీసీ బస్సులు త్రిపురాంతకం లోపలి నుండి ప్రయాణించాల్సి ఉండగా రాత్రి సమయాల్లో ఎక్కువ మంది ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను పట్టణంలోని నుండి కాకుండా బైపాస్ నుండి తీసుకువెళుతున్నారు. ఇలా రాకపోకలు సాగించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.