Prakasam News: సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. ప్రధాన కూడళ్లు, ఎక్కడపడితే అక్కడ నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) ఉంటాయి. ఈ విషయాన్ని మరచి అతి తెలివిగా భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు ఓ ప్రబుద్ధుడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. వివాహిత రాధ హత్య కేసు మిస్టరీని ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లేళపాడు కు చెందిన రాధకు 2013 లో నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో వివాహం అయ్యింది. మోహన్ రెడ్డి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. మోహన్ రెడ్డి భార్య రాధ స్నేహితుడు కాశీరెడ్డి ఆర్ధిక ఇబ్బందులతో ఉండటంతో తన భర్త మోహన్ రెడ్డి నుండి రూ.16 లక్షలు అప్పుగా ఇప్పించింది. ఆ తర్వాత ఒక కంపెనీ ఏర్పాటునకు గానూ మరో రూ.35 లక్షలు అప్పుగా ఇప్పించింది. ఆ తర్వాత కాశీరెడ్డి ఆ డబ్బులు ఇవ్వకపోగా ఆర్దిక ఇబ్బందులతో ఇల్లు విడిచి పరారయ్యాడు. దీంతో అతనికి ఇప్పించిన డబ్బుల విషయంపై రాధ, మోహన్ రెడ్డి దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి.
సీసీ టివీ పుటేజీతో
కనిగిరికి వస్తే అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లిస్తానని కాశిరెడ్డి నుండి మెసేజ్ చేయడంతో రాధ ఈ నెల 17న వెళ్లింది. అక్కడ హత్యకు గురైంది. కాశీరెడ్డే హత్య చేయించి ఉంటాడని అందరూ భావించారు. రాధ తల్లిదండ్రులు కూడా అదే తరహాలో ఫిర్యాదు చేశారు. పోలీసు దర్యాప్తులో కాశిరెడ్డి ప్రమేయం లేదని నిర్దారణ అయ్యింది. పామూరు బస్టాండ్ వద్ద రాధా ను తీసుకువెళ్లేందుకు ఆ రోజు వచ్చి కారు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో వాటిని పోలీసులు పరిశీలించారు. ఆ కారు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కారు కావడం, దానికి తోడు హత్య తర్వాత మోహన్ రెడ్డి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అతని కదలికలపై దృష్టి పెట్టారు. కనిగిరిలో రాధ వెళ్లిన సమయంలో ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన కారులో మోహన్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. దీంతో అతనిపై అనుమానం బలపడింది. శనివారం కోదాడలో రాధ అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి ప్రకాశం జిల్లాకు తరలించారు. అతని ఫోన్ ను పరిశీలన చేసి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.
రాధ తన స్నేహితుడు కాశీరెడ్డికి భారీగా డబ్బులు ఇప్పించడం, అతను తిరిగి ఇవ్వకపోవడంతో కోపంతో ఉన్న మోహనరెడ్డికి తన భార్యకు కాశీరెడ్డికి వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అనుమానించాడు. నిర్దారించుకునేందుకు ఒక కొత్త సిమ్ కార్డు తీసుకుని ఆ నెంబర్ కు ట్రూకలర్ లో కాశీరెడ్డి పేరు వచ్చేలా చేశాడు మోహన్ రెడ్డి. ఇటీవల కాశిరెడ్డి పేరుతో మోహన్ రెడ్డి తన భార్య రాధతో వాట్సాప్ ఛాటింగ్ చేశాడు. ఆ ఛాటింగ్ లో రాధ సమాధానాలు మోహన్ రెడ్డికి అనుమానం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో భార్య రాధను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కాశీరెడ్డి పేరుతో ఛాటింగ్ చేసి ఒంటరిగా కనిగిరి వస్తే డబ్బులు ఇస్తానని రాధకు మెసేజ్ చేశాడు మోహన్ రెడ్డి. దీంతో రాధ కనిగిరికి వెళ్లింది. ముందు ప్లాన్ ప్రకారం కనిగిరి బస్టాండ్ వద్దకు వెళ్లిన భర్త మోహన్ రెడ్డి ఆమెను కారులో ఎక్కించుకుని టిడ్కో ఇళ్ల పక్కకు తీసుకువెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత రాత్రి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆమె మృతదేహంపై కారును పదే పదే ఎక్కించి తొక్కించాడు. హత్యకు ముందు ఆమెను మోహన్ రెడ్డి కారులోనే చిత్రహింసలు పెట్టి గాయపర్చినట్లు భావిస్తున్నారు.