మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ప్రకాశం జిలిల్లాలో వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి సీఎం జగన్ తో చర్చించేందుకు బాలినేని సమావేశమైనట్లు తెలుస్తొంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంలో గత కొంత కాలంగా వివాదం నడుస్తొంది. తాను పార్టీ టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తన పై వివాదాలు సృష్టిస్తూ, సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని భావోద్వేగానికి గురై కంట తడిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంఓ నుండి బాలినేనికి కబురు రావడంతో ఇవేళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. దీంతో ఒంగోలు నియోజకవర్గానికే పరిమితం అయిన బాలినేని తో మరల రీజనల్ కోఆర్డినేటర్ పదవిలో కొనసాగాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.
కాగా సీఎం జగన్ తో భేటీ ముగిసిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాల మీద సీఎం తో చర్చించానని చెప్పారు. జిల్లాలో తాను ఎదుర్కొంటున్నా ఇబ్బందుల పై కూడా సీఎం కి వివరించానని తెలిపారు బాలినేని. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదని పేర్కొన్నారు. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉంటుంది? దని అన్నారు. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా చర్చ జరగలేదని చెప్పారు. గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశానని తెలిపారు. సీఎం జగన్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టమన్నారన్నారు. తాను ప్రతిపాదించిన నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. త్వరలో ఒంగోలులో పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ కి సీఎం వస్తారని బాలినేని తెలిపారు.