Road Accident: ఓ పెళ్ళి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మరికొద్ది గంటల్లో వివాహం జరగనుండగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. వధువు ను తీసుకొస్తున్న ఆటో ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందటంతో వివాహం జరగాల్సి ఇంట్లో అర్తనాదాలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే…. తర్లుపాడు మండలం సోమేపల్లి కి చెందిన ఓ యువతికి అక్క చెరువులో 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. బుధవారం ఉదయం యువతి బంధువులు ఆమె ఆటోలో ఎక్కించుకొని వివాహ వేదిక వద్దకు తీసుకెళ్తుండగా కలుజువ్వలపాడు వద్ద ఆటో నుండి పలువురు జారి కింద పడ్డారు. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. గాయపడిన మరికొందరిని మల్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వధువు ఆటో ముందు భాగంలో కూర్చోవడం వల్ల ఆమెకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. మృతులు కనకం కార్తీక్, అనిల్, సుబ్బారావు, శీను లు గా గుర్తించారు. ప్రమాద ఘటన పై పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.