Prakasam YSRCP: రాష్ట్రమంతటా వైసీపీ గెలిచినా.. 151 స్థానాలొచ్చినా.. జగన్ లో ఏదో వెలితి..!
జిల్లాలో 8 స్థానాలొచ్చినా.. మాంచి ఆధిక్యతతో గెలిచినా వైసీపీలో ఏదో వెలితి..!
ఆ 23 మందిలో అందరినీ ఓడించాలన్న జగన్ టార్గెట్ నిలవలేదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను కాదని పార్టీ మారిన ఆ 23 మందీ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనుకున్న జగన్ శపథం నెరవేరలేదు. ఆ శపథానికి, ఆ పంతానికి గొట్టిపాటి రవికుమార్ ఒక్కరే అడ్డుగా నిలిచారు. అందరూ వేరు, తాను వేరని నిరూపించారు. ఏక నాయకుడి గాలికీ, ఏకపక్ష ఎన్నికలకు తాను అతీతుడినని అద్దంకిలో అల్లుకుపోయారు.. ఫలితంగా ఇప్పుడు వైసీపీ టార్గెట్ అద్దంకి ఫిక్సయింది. గొట్టిపాటిని ఓడించడమే లక్ష్యంగా వైసీపీ చిన్నా, పెద్దలు పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా మంత్రి బాలినేని చెప్పేసారు. మరి అది సాధ్యమేనా..!? అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ని ఓడించగలరా..? ఆ బలం కృష్ణ చైతన్యకి ఉందా..!? ఆ బలగం వైసీపీకి ఉందా..!?
Prakasam YSRCP: “అద్దంకి”పై బాలినేని ఏమన్నారంటే..!? ఎందుకంత పట్టుదలంటే..!?
“చైతన్య నాతో పాటూ ఎమ్మెల్యేగా ఉండాలి. ఇప్పటి నుండీ అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్లాన్ చేసుకోవాలి. అవతలి వ్యక్తి బాగా డబ్బు సంపాదించుకొని ఉన్నారు. దానికి ధీటుగా మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ప్రతీ విషయంలో ఇప్పటి నుండి, ప్రతీ గ్రామంలో గ్రూపులు లేకుండా చూసుకోవాలి. పటిష్టమైన నాయకత్వాన్ని, నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. అవతలి వారి బలం, మెజారిటీపై అంచనా వేసుకోవాలి. అద్దంకి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కాదు, అక్కడ వైసీపీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. సంతమాగులూరు, బల్లికురవ మండలాలు వైసీపీకి అనుకూలం. అద్దంకిని ఈ సారి కొట్టితీరుతాం. సీఎం జగన్ గారు మొన్న కూడా అన్నారు. ఏ పరిస్థితుల్లోనూ అద్దంకిని గెలవాలి, ప్లాన్ చేసుకోండి అన్నారు. అన్ని రకాలుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలిచి తీరుతాం. జగన్ మోహన్ రెడ్డిగారు నాకు టార్గెట్ పెట్టారు. చైతన్య ప్రజల్లోకి వెళ్లి అందరినీ ఆదరించాలి, కార్యకర్తలు అందరికీ అండగా నిలవాలి. రేపు మళ్ళీ చైతన్య గెలవకపోతే నాకు మంత్రి పదవి కూడా ఇవ్వనున్నారు సీఎం గారు.. కాబట్టి.., గెలిచితీరాల్సిందే. చైతన్యని ఎమ్మెల్యేగా చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను”
పని జరుగుతుందా..? పట్టు పెరుగుతుందా..!?
బాలినేని మాటల్లో అంతరంగం అద్దంకి వైసీపీ శ్రేణులకు బాగానే అర్ధమై ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం అద్దంకి గెలిచి తీరాలనేది సీఎం జగన్ నుండి మంత్రి బాలినేని వరకు ఉన్న లక్ష్యం. కానీ… దీనికి చాలా కష్టాలున్నయ్..! ప్రణాళిక, పట్టుదల, అధికారం, ఆర్ధిక బలం ఒక్కటే చాలదు. చాలా లెక్కలు, చాలా లోతులు ఉన్నయ్.
- 2014 ఎన్నికల్లో జగన్ ప్రభావంతో ఇక్కడ గొట్టిపాటి గెలవలేదు. టీడీపీ తప్పిదాలు, నాటి అభ్యర్థి అతి విశ్వాసం కారణంగా… కాంగ్రెస్ హయాంలో రవికుమార్ చేసిన పనులు, తాను చేసిన ప్రచారం, పక్కా ప్లానింగ్, పోల్ మేనేజ్మెంట్ అన్నీ కలిసొచ్చి నాడు స్వల్ప తేడాతో రవికుమార్ గెలిచారు.
- ఆ తర్వాత ఎన్నికల్లో అంటే 2019లో బాలినేని చెప్పినట్టు కేవలం డబ్బు బలంతోనే గొట్టిపాటి గెలవలేదు. మూడేళ్ళ కఠోర శ్రమ ఉంది. పార్టీ మారిన తనను మళ్ళీ ప్రజలు ఆదరిస్తారో, లేదోనన్న భయం ఉంది. కొత్తగా పార్టీలోకి వచ్చి తొలి ఎన్నిక ఎదుర్కొంటున్న తనకు టీడీపీ నాయకులు పూర్తిస్థాయిలో పని చేస్తారో, లేదోనన్న బెంగ ఉంది. తనతో వచ్చిన సొంత మనుషులు టీడీపీతో కలిసి పని చేస్తారో, లేదోనన్న శ్రద్ధ ఉంది. ఆ భయం, బెంగ, శ్రద్ధ వెరసి 2016 నుండి 2019 వరకు రవికుమార్ కష్టపడ్డారు. వ్యక్తిగత స్వార్ధం కోసం పార్టీ మారానన్న ముద్ర పోయి.., నియోజకవర్గం కోసమే, అభివృద్ధి కోసమే మారానన్న మాటలను జనంలోకి వెళ్లేలా జాగ్రత్త పడ్డారు. ఆ మూడేళ్లు అద్దంకిలో అల్లుకుపోయారు. అయిదు మండలాల్లోనూ.., అన్ని గ్రామాల్లోనూ తన వ్యక్తిగత ఇమేజీతో పాటూ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు, పథకాలు అన్నీ అందరికీ చేరేలా చూసారు. వర్గాలు, రాజకీయాలు చూడలేదు. దీంతో పాటూ కరణం వర్గం ఎటువంటి బేధాభిప్రాయాలూ చూడకుండా క్షేత్రస్థాయిలో రవికుమార్ కోసం పని చేసింది. అలా ఆ మూడేళ్లు పడిన శ్రమ, చేసిన పనుల ఫలితమూ.., ఎన్నికల సమయంలో కరణం వర్గం కలిసిపోవడంతో 2019లో రవికుమార్ గెలిచేలా చేసింది. జగన్ గాలిని అద్దంకిలో పని చేయకుండా చేసింది. ఇప్పుడు రవికుమార్ ని ఓడించాలంటే వైసీపీకి ఉన్న అర్ధ, అంగ బలం చాలానే చాలదు. 2019 లో రవికుమార్ కి ఉన్న బలానికి తోడు ఇప్పుడు అధికార పార్టీ వేధింపులు, వ్యాపారాలను దెబ్బతీశారు, ఆర్ధికంగా మూలలను దెబ్బతీశారు, స్వయంగా సీఎం జగన్ టార్గెట్ చేశారన్న సానుభూతి తోడయింది. ఇది జనం మధ్య చర్చగా మొదలయింది. ఇది రవికుమార్ కి వ్యక్తిగతంగా అదనపు బలంగా చేరింది.
కృష్ణ చైతన్య రాటుదేలాలి..!!
అద్దంకి అంటే కరణం వర్గమూ.., గొట్టిపాటి వర్గమూ అందరికీ కనిపిస్తుంది. కానీ గరటయ్య వర్గమూ కొంత మేరకు ఉంది. ఆ రెండు వర్గాలతో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ మూడు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న గరటయ్యకు కొన్ని గ్రామాల్లో వారికే తెలియని పట్టుంది. కానీ వారు కాలక్రమేణ వేరే వర్గాల్లో, పార్టీల్లో కలిసిపోయారు. కానీ తండ్రులకు ఉన్న బలగం, వారసులకు రాకపోవచ్చు. అద్దంకిలో కరణం బలరాంకి ఉన్న పేరు, అభిమానగణం వెంకటేష్ సంపాదించుకోలేకపోయారు. బలరాం నాయకత్వం, దూకుడు, కష్టం, సబ్జెక్టు, అల్లుకుపోయే తత్వం ముందు వెంకటేష్ లో ఆ లక్షణాలు కొద్దిపాటిగా మెరుగవ్వాలి. అది జరగకముందే వారు నియోజకవర్గానికి దూరమయ్యారు. అదే కోవలోకి గరటయ్య కూడా వస్తారు. గరటయ్య శైలి వేరు, కృష్ణ చైతన్య శైలి వేరు. నేటి రాజకీయాలకు తగ్గట్టు కృష్ణ చైతన్య చాలా మెరుగవ్వాలి. నాయకత్వంలో రాటుదేలాలి. గడిచిన ఏడాది కాలంలో బాగానే పనిచేస్తున్నారన్న పేరు తెచ్చుకున్నారు. పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. ప్రస్తుతానికి ఆయనకు అధికారం బలం ఉంది. అది చూసి చాలా మంది నాయకులు దగ్గరకు వస్తారు. అది చూసుకుని తన బలం పెరిగింది అనే విధానంలోకి వెళ్తే మునిగినట్టే.. ఎవరు అభిమానంతో వచ్చారో.., ఎవరు అధికారం కోసం వచ్చారో తెలుసుకోవడమే అధికార పార్టీ నాయకుడికి పెద్ద పరీక్ష. ఎవరు ఎలా వచ్చినా అందరూ తన కోసం పని చేసేలా చేసుకోవడమే తన ముందున్న కర్తవ్యమ్. గ్రామాల్లో తన వ్యక్తిగత కోటరీ ఏర్పాటు చేయడం.., నియోజకవర్గ సమస్యలపై అవసరమైన చోట గొంతెత్తడం.., పార్టీలకు, కులానికి అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లడం.., ప్రతీ ఓటరుకీ తనకు తాను మళ్ళీ మళ్ళీ ఎదురవ్వడం.. ఇలాంటి రాజకీయాలు ఇప్పటి నుండే మొదలుకావాలి. బాలినేని చెప్పినట్టు కేవలం డబ్బు ఒక్కటే ఏ మూలకు పని చేయదు. అదే నిజమైతే శిద్దా లాంటి వారు జీవితాంతం ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేగా గెలుస్తూ స్థిరపడిపోవచ్చు. మాటలు చూసుకుంటే అద్దంకి నుండి కృష్ణ చైతన్య పోటీ చేస్తారని శ్రేణుల్లో ఒక నమ్మకం కుదిరింది. ఏమో… రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. జగన్ దగ్గర లాబీయింగులు, కోటరీలు పని చేయవు. ఆయన అనుకున్నది చేసి తీరతారు. 2024 వచ్చే సరికి అద్దంకిలో కృష్ణ చైతన్య కంటే మరో నాయకుడు అయితేనే మంచిది అని భావిస్తే ఆ మార్పులూ తప్పకపోవచ్చు..! అందుకే కృష్ణ చైతన్య ఇప్పటి నుండీ జగన్ నమ్మకం గెలుచుకోవాలి, ప్రజల నమ్మకమూ గెలుచుకోవాలి..!