Ramachandra Yadav: రాష్ట్రంలోని అన్ని వర్గాల భద్రత, భవిత, బాగు కోసమే నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నామని బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. ప్రజా సింహ గర్జన నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ బహిరంగ ఏర్పాట్లు గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జరుగుతున్నాయి. లక్షలాది మంది బహిరంగ సభకు విచ్చేస్తున్నందున భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సన్నాహక సమావేశాలు జరగ్గా, జిల్లాలకు టీమ్ లు వెళ్లాయి. రేపు మధ్యాహ్నం 3.45 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ బహిరంగ సభ జరుగుతుంది.
ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మీడియాతో మాట్లాడుతూ ..రాష్ట్రంలో పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు మారుతున్నా వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు రోజురోజుకు తగ్గిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న యువత ఉన్నా ఇక్కడ పారిశ్రామిక, ఇతర రంగాల్లో అభివృద్ధి లేకపోవడం వల్ల అన్ని జిల్లాల నుండి యువత ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొని ఉందన్నారు.
దోపిడీ, కుటుంబ పాలనలు సాగనంపేందుకే
రాష్ట్రంలోని అన్ని రంగాలు వెనుకడుగు వేసే పరిస్థితి ఉంది తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారు గానీ మహిళా అభివృద్ధి, మహిళా రక్షణకు చర్యలు లేవన్నారు. పథకాలు పేరు చెప్పి, విద్య పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదనీ, అన్నివర్గాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయన్నారు. ఈ దోడిపీ, కుటుంబ రాజకీయాల నుండి ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రాష్ట్రంలో సరికొత్త ప్రజా రాజకీయ వ్యవస్థ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆ అకాంక్షలకు అనుగుణంగానే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం జరగబోతున్నదని చెప్పారు.
వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్నాయని విమర్శించారు. ఈ వర్గాలు అభివృద్ధి చెందలేదని ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించారన్నారు. తెలుగు వాడి ఆత్మ గౌరవం పేరుతో 1983లో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ బీసీ లకు సంబంధించి రిజర్వేషన్ల అంశం పరిశీలిస్తామని, మురళీధరన్ కమిషన్ ఇచ్చిన రికమండేషన్ లు అమలు చేస్తామని చెప్పి ప్రధాన హామీ ఇవ్వడం ద్వారా నాటి నుండి గత ఎన్నికల వరకూ ఆ వర్గాలు టీడీపీ మద్దతు ఇచ్చాయనీ కానీ ఈ రోజు వరకూ కూడా ఆ విషయాలను ప్రస్తావించడం గానీ, ఆ కమిషన్ రికమండేషన్లు అమలు చేసే ప్రయత్నం గానీ టీడీపీ చేయలేదన్నారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి బీసీలను పూర్తిగా వంచించారన్నారు. బీసీలు అందరు ఒక వర్గంగా చెప్పుకుంటున్న తరుణంలో కులాల వారీగా విడదీసి 56 కార్పోరేషన్ లు పెట్టి వారి పార్టీ కార్యకర్తలు, నాయకులకు పదవులు ఇచ్చారు తప్ప ఒక్క కార్పోరేషన్ కు కూడా నిధులు ఇవ్వలేదన్నారు. ఇలా బీసీలను పూర్తిగా వంచించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. పార్టీకి సంబంధించి జెండా, అజెండా, విధి విధానాలు, మేనిఫెస్టో తదితర విషయాలు అన్నీ రేపు (23వ తేదీ) పార్టీ ఆవిర్భావ బహిరంగ సభలో వెల్లడిస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు. కుటుంబ పాలనలు, దోపిడీ పాలనలు పోవాలంటే కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే రాష్ట్రంలో రాజకీయ మార్పు జరగాలన్నారు. అందుకే ముందడుగు వేశామని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం అందరూ కలిసిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.