Praja Simha Garjana: జనసంద్రమైన ప్రజా సింహగర్జన సభాస్థలి .. వర్షంతో ఇక్కట్లుచిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కొద్ది గంటల్లో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతున్నది. విజయవాడ – గుంటూరు జాతీయ రహదారిపై నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న 120 ఎకరాల ఖాళీ స్థలంలో ప్రజా సింహగర్జన బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రామచంద్ర యాదవ్ అభిమానులు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే వర్షం పడటంతో సభకు వచ్చిన జనాలు ఇబ్బంది పడ్డారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాహనాల నిలుపుదలకు ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. సభకు విచ్చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రామచంద్ర యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి నినాదాలు చేస్తున్నారు.
సభా వేదికపై వివిధ జిల్లాల నుండి వచ్చే ముఖ్య నేతలు 50 మందికిపైగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు సుమారు రెండు లక్షల మంది వరకూ వచ్చే అవకాశం ఉందని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. పార్టీ పేరు, జెండా, అజెండా, మేనిఫెస్టో వివరాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 3.30 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకూ బహిరంగ సభ జరగనున్నది. ఈ సభలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ముఖ్య నేతలు ప్రసంగించిన తర్వాత బోడె రామచంద్ర యాదవ్ రాజకీయ పార్టీ ఉద్దేశం, ఇతర వివరాలు వెల్లడించనున్నారు. రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ వేళ ఉదయం రామచంద్రయాదవ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
భారీ ఏర్పాట్లు, పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తుండటంతో రామచంద్ర యాదవ్ పార్టీ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రామచంద్ర యాదవ్ వెనుక ఎవరు ఉన్నారు, ఏ పార్టీ ఉంది అనే చర్చ జరుగుతుండగా, తన వెనుక ఏ రాజకీయ శక్తీ లేదనీ, ప్రజలే ఉన్నారని పేర్కొంటున్నారు రామచంద్ర యాదవ్. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లా నుండి రాత్రే బయలు దేరి ఉదయాని కల్లా చేరుకోగా, సమీప జిల్లాల అభిమానులు ఉదయం బయలుదేరి మధ్యాహానికి వేదిక వద్దకు చేరుకున్నారు.