నెల్లూరు వైసీపీలో గ్రూపు విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (అబ్బాయ్), డిప్యూటి మేయర్ (బాబాయ్) మద్య ఉన్న విభేదాలపై స్వయంగా సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. వారి వైఖరిలో మార్పు లేదు. ఒకరిపై మరోకరు బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. రూప్ కుమార్ మద్దతుదారుడైన వైసీపీ మైనార్టీ నేత హాజీ పై శనివారం దాడి జరగడం తీవ్ర కలకలాన్ని రేపింది. అనిల్ వర్గీయులే హాజీపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. హాజీపై దాడి సమాచారం తెలిసిన వెంటనే రూప్ కుమార్ యాదవ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
అనిల్ పై ఆరోపణలు
తన మద్దతు దారులను భయబ్రాంతులకు గురి చేసేందుకే అనిల్ కుమార్ ఈ విధంగా దాడులు చేస్తున్నారంటూ రూప్ కుమార్ ఆరోపించారు. గతంలో కార్పోరేటర్ నాగరాజు ఇంటిని ధ్వంసం చేశారనీ, అప్పుడు పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని రూప్ కుమార్ అంటున్నారు. ఆ తర్వాత మరో నేత మున్వర్ కు చెందిన షాపు వద్ద మెట్లను పగలగొట్టించారనీ, అంతే కాకుండా తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టించారని రూప్ కుమార్ యాదవ్ ఆరోపించారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను భరిస్తున్నాననీ, భవిష్యత్తులో తన వర్గీయులపై మరో సారి దాడి జరిగితే ఊహించనంతగా స్పందిస్తానంటూ హెచ్చరించారు.
నెల్లూరు నగరంలో పార్టీని అనిల్ సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూప్ కుమార్ ఆరోపణలపై అనిల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. నెల్లూరులో ఏమి జరిగినా తనకే ఆపాదించడం సరికాదని అన్నారు. ఎవరెవరో కొట్టుకుంటే తనను అనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆ దాడితో తనకు ఎలాంటి సంబందం లేదని అనిల్ కుమార్ అన్నారు. ఈ దాడి వెనుక తాను ఉన్నట్లు బాధితుడిని ప్రోత్సహించి తన పేరు చెప్పించారని ఆరోపించారు. గతంలో హాజీకి ఏమైనా వివాదాలు ఉంటే వాటి వల్ల ఈ దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తన ఓపికను పరీక్షించవద్దంటూ హెచ్చరించారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే బెట్టింగ్ రాజు అనే మచ్చ తాను మోస్తున్నాననీ, ఈ పాపం నాది కాదని నన్ను విమర్శించే వ్యక్తి దేవుని ముందు ప్రమాణం చేస్తాడా అని ప్రశ్నించారు. లీకులు ఇవ్వాలంటే తనకు ఎంత సేపు పట్టదన్నారు.
గత వారం కావలి పర్యటన సందర్బంగా అనిల్ కుమార్, రూప్ కుమార్ (అబ్బాయ్, బాబాయ్) లను కలిపి ఒకరి చేతిలో ఒకరి చేయి వేసి భవిష్యత్తులో కలిసి కట్టుగా పని చేయాలంటూ సీఎం జగన్ సూచించారు. ఈ పరిణామంతో ఇక నెల్లూరులో వారి మధ్య విబేదాలు తొలగిపోతాయని పార్టీ శ్రేణులు భావించారు. అయితే ఆ మరుసటి రోజే అనిల్ కుమార్ సంచలన ప్రకటన చేసారు. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ ఆతని (రూప్ కుమార్)తో కలిసి పని చేసే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా ఇరువర్గాల మద్య వార్ కొనసాగుతునే ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా అబ్బాయ్, బాబాయ్ మద్య విభేదాలు కొనసాగడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తొంది. నెల్లూరు నగర వైసీపీలో నెలకొన్న ఈ పరిణామాలపై మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డ ప్రభాకర్ రెడ్డిలతో రూప్ కుమార్ వర్గీయులు చర్చించినట్లు సమాచారం.