Home వార్తలు సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ను వినియోగించుకొని విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించడం విశేషమని పేర్కొన్నారు. గతంలో విద్యలో వెనుకబాటుతనం, వైఫల్యాలను ఎదుర్కొన్న సదరు విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పునః ప్రవేశ నోటిఫికేషన్ చక్కని తోడ్పాటు అందించిందన్నారు. విద్యార్థులు పదో తరగతిలో పునః ప్రవేశం పొందడం ద్వారా ఉన్నత స్థాయి తరగతుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడమే గాక మరింత పట్టుదలగా చదివి మార్కుల్లో గణనీయమైన పెరుగుదల చూపించారన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులకు సంబంధించి 2023లో పదో తరగతిలో పొందిన మార్కులను, ప్రస్తుతం పొందిన మార్కులకు తేడా చూపిస్తూ వారి ప్రగతిని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు.

ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ఒక విద్యార్థిని హాల్ టికెట్ నంబర్ 2415101830 505 మార్కులు (84 శాతం) సాధించింది. ఇదే విద్యార్థిని 2023లో కేవలం 266 మార్కులు (44 శాతం) మాత్రమే సాధించిందన్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పునః ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్, కొత్త మార్గదర్శకాలు, అవకాశాలను వినియోగించుకొని సదరు విద్యార్థి సక్రమంగా పాఠశాలలో అన్ని తరగతులకు హాజరై, అన్ని సబ్జెక్టులను బాగా చదివి మంచి మార్కులు సాధించడం విశేషమన్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ జీవో నెంబర్ 50 తో పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. చదువులో వెనుకబడిన, మార్కుల్లో వైఫల్యం చెందిన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చిన ఈ సంస్కరణను వారి భవిష్యత్ కు మంచి మార్గంగా ప్రవీణ్ ప్రకాష్ అభివర్ణించారు.

Exit mobile version