రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపిల ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపినందుకు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణకు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వైసిపి విముక్త ఆంధ్రపదేశ్ కోసం జయప్రకాష్ నారాయణ స్వచ్చంధంగా మద్దతు తెలిపారు అని పేర్కొన్నారు. గురువారం తెనాలి లోని జనసేన పార్టీ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా అధ్యక్షులు బాబ్జీ వచ్చి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…ప్రజల్లో ప్రజాస్వామ్య విలువ పెంచేందుకు జయప్రకాశ్ నారాయణ ఎంతో కృషి చేశారని తెలిపారు. వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఓటరుకు ఉందన్న ఉద్దేశంతో గత 15 ఏళ్లుగా ఆయన పోరాటం చేస్తున్నారని కొనియాడారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై బాబ్జీ లోతుగా విశ్లేషించి ప్రతి వేదికపైన వారి తరుపున పోరాటం చేస్తూ లోక్ సత్తా ను ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు.